Relief for FASTag Users:ఫాస్టాగ్ వాడుతున్నారా? పదే పదే డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేయించలేక, బ్యాంకుల చుట్టూ తిరగలేక విసిగిపోయారా? అయితే మీకోసం కేంద్ర ప్రభుత్వం కొత్త ఏడాది కానుకగా ఒక భారీ ఉపశమనాన్ని ప్రకటించింది. ఫాస్టాగ్ వినియోగదారులకు ఎంతో అసౌకర్యంగా మారిన నో యువర్ వెహికిల్ (KYV) ప్రక్రియను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) తాజాగా రద్దు చేసింది.
ఏమిటీ మార్పు? ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది?
సాధారణంగా ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత కూడా వాహనదారులు పదే పదే డాక్యుమెంట్లను సమర్పించాల్సి వచ్చేది. దీనివల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం, ఈ KYV విధానాన్ని పూర్తిగా ఎత్తివేసింది.2026 ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి లైట్ మోటార్ వెహికిల్స్ (LMV) కేటగిరీకి ఈ వెసులుబాటు వర్తిస్తుంది.
కేంద్రం నిర్ణయానికి కారణాలు
ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత కూడా పోస్ట్-యాక్టివేషన్ వెరిఫికేషన్ పేరుతో బ్యాంకులు ఫాలో-అప్ చేయడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఫాస్టాగ్ ఇచ్చే ముందే వాహనానికి సంబంధించిన అన్ని వివరాలను సేకరిస్తారు కాబట్టి, మళ్లీ మళ్లీ వెరిఫికేషన్ (KYV) అవసరం లేదని NHAI భావించింది.
మరి పాత ఫాస్టాగ్ పరిస్థితి ఏంటి?
ఇప్పటికే మీ కారుకు ఫాస్టాగ్ ఉంటే, దానికి కూడా ఇకపై KYV ప్రక్రియ అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఫాస్టాగ్ను ఎవరైనా దుర్వినియోగం చేసినా లేదా గ్లాస్కు సరిగ్గా అంటించకపోయినా వంటి అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే తనిఖీలు ఉండొచ్చు.
నేషనల్ హైవేలపై ప్రయాణం మరింత సులభతరం చేసేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మందికి బ్యాంక్ పనుల నుంచి, డాక్యుమెంట్ టెన్షన్ల నుంచి విముక్తి లభించినట్లయింది.

