Postal Insurance Scheme: వ్యక్తిగత, ఆరోగ్య భీమాలపై జీఎస్టీ తగ్గింపుతో ఇటీవలి కాలంలో వీటికి ఫుల్ డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా, కోవిడ్ వైరస్ విజృంభన అనంతరం లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్పై చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో, భీమా తీసుకునేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో సంపాదిస్తున్న వ్యక్తి అనుకోని సంఘటన జరిగి దూరమైతే.. ఇన్సూరెన్స్ పాలసీలు ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తాయి. తక్కువ ప్రీమియంతోనే ఇండియన్ పోస్ట్ ఆఫీసు జీవిత బీమా పాలసీలు తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షలు
పోస్ట్ ఆఫీస్ ద్వారా కేవలం రూ.755 వార్షిక ప్రీమియంతో రూ.15 లక్షల వరకు కవరేజీని అందిస్తుంది. బీమా తీసుకున్న వ్యక్తి ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.15 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా శాశ్వత అంగవైకల్యం లేదా పూర్తిగా పక్షవాతం వస్తే పూర్తి బీమా మొత్తం రూ. 15 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినప్పుడు అయ్యే వైద్య ఖర్చులకు (బిల్లుల ఆధారంగా) రూ. లక్ష వరకు చెల్లిస్తారు. ఆసుపత్రిలో సాధారణ వైద్యానికి రోజుకు రూ.1000, ఐసీయూలో చేరితే రోజుకు రూ.2 వేలు చెల్లిస్తారు. చేయి లేదా కాలు విరిగినట్లయితే రూ.25 వేలు అందిస్తారు. పాలసీదారు ప్రమాదంలో మరణిస్తే లేదా శాశ్వత వైకల్యానికి గురైతే, పిల్లల చదువు కోసం రూ. లక్ష, పెళ్లి కోసం మరో రూ.లక్ష అదనంగా పోస్టల్ శాఖ అందిస్తారు.
రూ.399 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల కవరేజీ
పోస్ట్ ఆఫీస్ ద్వారా కేవలం రూ.399 వార్షిక ప్రీమియంతో రూ.10 లక్షల వరకు ఈ పథకం కవరేజీని అందిస్తుంది. ప్రమాదవశాత్తు పాలసీదారు మరణిస్తే, నామినీకి పూర్తి బీమా మొత్తం రూ. 10 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా శాశ్వత పూర్తి అంగవైకల్యం లేదా పక్షవాతం సంభవిస్తే, రూ.10 లక్షల పూర్తి కవరేజీ లభిస్తుంది. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినప్పుడు అయ్యే వైద్య ఖర్చులకు రూ.60,000 వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదం కారణంగా ఆసుపత్రిలో చేరకుండా, కేవలం ఔట్-పేషెంట్ విభాగం (OPD)లో చికిత్స పొందితే రూ.30,000 వరకు కవరేజీ లభిస్తుంది. ప్రమాదంలో పాలసీదారు మరణిస్తే లేదా శాశ్వత వైకల్యానికి గురైతే, గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.లక్ష వరకు (లేదా పాలసీలో పేర్కొన్న శాతం) చెల్లిస్తారు. ఆసుపత్రిలో చేరినప్పుడు (ICU కాకుండా) ప్రతి రోజూ రూ.1,000 చొప్పున గరిష్టంగా 10 రోజుల వరకు చెల్లిస్తారు. ప్రమాద మరణం సంభవిస్తే అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 5,000 వరకు నామినీకి చెల్లిస్తారు. ప్రమాదం జరిగినప్పుడు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లడానికి అయ్యే రవాణా ఖర్చులకు రూ. 25,000 వరకు చెల్లించే అవకాశం ఉంది. అయితే, ఈ పథకం పొందడానికి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB)లో ఖాతా ఉండడం తప్పనిసరి. పాలసీని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కుటుంబానికి ఎంతో భరోసానిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.


