RBI floating rate savings Bonds: ఆర్థిక భద్రతను కోరుకునే పెట్టుబడిదారులకు ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. కేంద్రం సహకారంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ (FRSBs) 2020ను అందిస్తోంది. ప్రస్తుతం అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడి మార్గంగా ఉన్నాయి. దీంతో మంచి రాబడులు, ప్రభుత్వ హామీ ఉంటుంది. మెరుగైన భద్రత వంటి ప్రయోజనాలతో బాండ్ల మార్కెట్లో ఇది ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
వడ్డీ రేటు ఎలా నిర్ణయిస్తారు?
చేసే ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ ముఖ్య లక్షణం ఏమిటంటే ఫ్లోటింగ్ వడ్డీ రేటు అందివ్వడమే. అంటే ఇది స్థిరంగా ఉండదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ రేటు మారుతుంది. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 8.05 శాతంగా ఉంది. ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) వడ్డీ రేటు కంటే 0.35% ఎక్కువగా నిర్ణయించబడుతుంది. ఈ రేటు జనవరి 1, జూలై 1 తేదీలతో మారుతుంది. NSC వడ్డీ పెరిగితే, చేసే ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్ వడ్డీ కూడా అదే రీతిలో పెరుగుతుంది. ఇది డైనమిక్ ఆదాయం కోరే వారికి మంచి ఎంపిక అవుతుంది
వడ్డీ చెల్లింపు. కాల వ్యవధి
ఈ బాండ్లు అర్ధవార్షికంగా వడ్డీ చెల్లించేవి. అంటే ఏడాదికి రెండుసార్లు జనవరి 1 మరియు జూలై 1న, ఇలా మీ ఖాతాలో వడ్డీ జమ అవుతుంది. ఇది నిరంతర ఆదాయాన్ని కోరే పెట్టుబడిదారులకు ఉపయోగపడుతుంది. మెచ్యూరిటీ కాలం 7 సంవత్సరాలు, ఇది మిడియం టర్మ్ పెట్టుబడికి అనుకూలంగా ఉంటుంది.
పెట్టుబడి పరిమితులు
- కనీస పెట్టుబడి: రూ.1,000
- గరిష్ట పరిమితి: లేదు
- మల్టిపుల్స్లో మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు
- పెద్ద మొత్తాల పెట్టుబడి కోసం ఇది చక్కటి మార్గం
పన్ను విధానం
ఈ బాండ్లు పన్ను విధించదగినవి. అందుకే వాటి ద్వారా పొందే వడ్డీ ఆదాయం ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం “ఇతర వనరుల నుండి ఆదాయం”గా పరిగణిస్తారు. రూ.10,000 కంటే ఎక్కువ వడ్డీ వచ్చే సందర్భంలో టిడిఎస్ (Tax Deducted at Source) వర్తిస్తుంది. అయితే ఈ బాండ్లు బదిలీ చేయలేము, ట్రేడింగ్ చేయలేము, లొన్కు పూచీకత్తుగా ఇవ్వలేము.
ప్రభుత్వ హామీతో పూర్తి భద్రత
ఈ బాండ్లు ఎంతో సురక్షితమైనవి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తరపున RBI జారీ చేస్తుంది. మార్కెట్ ప్రమాదాల పట్ల విసిగిపోయిన వారికి ఇది ఒక స్థిరమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.
లాక్-ఇన్ పీరియడ్
దీనికి లాక్ ఇన్ పిరియడ్ 7 సంవత్సరాలు ఉంటుంది. అయితే సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సడలింపులు ఉన్నాయి. వయస్సును బట్టి 4 నుంచి 6 సంవత్సరాల తర్వాత ముందస్తుగా ఉపసంహరణ చేయవచ్చు. కానీ, చివరి 6 నెలల వడ్డీలో 50 శాతం పెనాల్టీ విధించబడుతుంది.
ఈ బాండ్లలో పెట్టుబడికి ఎవరు అర్హులు..
- భారతీయ నివాసితులు (వ్యక్తిగతంగా లేదా సంయుక్తంగా)
- హిందూ అవిభక్త కుటుంబాలు (HUFs)
- మైనర్ల తరపున తల్లిదండ్రులు/సంరక్షకులు
- ప్రవాస భారతీయులు (NRIs) మాత్రం అర్హులు కాదు
ఎలా పెట్టుబడి పెట్టాలి?
ఈ బాండ్లలో SBI, యాక్సిస్ బ్యాంక్, HDFC, కోటక్ మహీంద్రా వంటి బ్యాంకుల ద్వారా, లేదా స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SHCIL) ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు.
- దరఖాస్తు ఫారం
- KYC పత్రాలు (PAN, చిరునామా రుజువు)
- చెల్లింపు వివరాలు
- బాండ్లు ఎలక్ట్రానిక్ రూపంలో (BLA) జారీ అవుతాయి


