India: భారత స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల కారణంగా నెగటివ్ ట్రెండ్తో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణతో నష్టాలతో ముగిసాయి.
సెన్సెక్స్ 572.07 పాయింట్లు (-0.70%) తగ్గి 80,891 వద్ద ముగిసింది. నిఫ్టీ 156.10 పాయింట్లు (-0.63%) నష్టపోయి 24,680.91 వద్ద స్థిరపడింది. మొదటి నుంచే మార్కెట్ మైనస్లో ప్రారంభమైంది. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడితో ఇంట్రాడే కనిష్ఠ స్థాయి 80,776.44 వరకు పడిపోయింది. గత ట్రేడింగ్ డే ముగింపు 81,463.09 పాయింట్ల వద్ద ఉండగా, ఈ రోజు ట్రేడింగ్ 81,299.97 వద్ద ప్రారంభమైంది.
రంగాల వారీగా ట్రెండ్:
బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, ఆటో రంగాల్లో స్పష్టమైన నష్టాలు నమోదయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ 444 పాయింట్లు, నిఫ్టీ ఐటీ 253 పాయింట్లు, నిఫ్టీ ఫిన్ సర్వీస్ 192 పాయింట్లు, నిఫ్టీ ఆటో 88 పాయింట్లు క్షీణించాయి. మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీల్లో కూడా 0.8%-1.2% మధ్య నష్టాలు వచ్చాయి.
ఇతర సూచీలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ-100 157 పాయింట్లు (0.62%), నిఫ్టీ మిడ్క్యాప్-100 490 పాయింట్లు (0.84%), నిఫ్టీ స్మాల్క్యాప్-100 229 పాయింట్లు (1.26%) పడిపోయాయి.
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారతి ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టైటాన్, ఎస్బీఐ, టాటా స్టీల్, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ఎక్కువ నష్టపోయాయి.
టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ముగిశాయి.
Readmore: https://teluguprabha.net/business/post-office-saving-scheme-deposit-rs-333-get-rs-17-lakh/
నిపుణుల విశ్లేషణ:
జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానిస్తూ.. వాణిజ్య ఒప్పందాల్లో జాప్యం, త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు. ఎఫ్ఐఐలు నిధులు ఉపసంహరించుకోవడంతో మార్కెట్లపై ఒత్తిడి పెరిగింది అని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా అమెరికా-ఈయూ వాణిజ్య సంబంధాలు శాంతంగా ఉన్నా, రాబోయే రోజుల్లో ఫెడ్, బాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన నిర్ణయాలు మార్కెట్ దిశను నిర్ణయించడంలో కీలకమవుతాయని అభిప్రాయపడ్డారు.
రూపాయి ట్రెండ్: డాలరుతో పోలిస్తే రూపాయి 0.10% బలహీనపడి రూ. 86.65 వద్ద ట్రేడయ్యింది.


