Sundar Pichai Billionaire Journey: ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఒక సంచలనం. తమిళనాడులోని ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, గూగుల్ అనే మహా సామ్రాజ్యానికి సీఈఓగా ఎదిగిన సుందర్ పిచాయ్ ఇప్పుడు బిలియనీర్ల క్లబ్లో అడుగుపెట్టారు. గూగుల్ మాతృసంస్థ ‘ఆల్ఫాబెట్’ సీఈఓగా పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో ఆయన ఈ అరుదైన మైలురాయిని అందుకోవడం విశేషం. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు, ఒక సాధారణ ఉద్యోగిగా ప్రస్థానం మొదలుపెట్టి, టెక్ ప్రపంచంలోనే అత్యున్నత శిఖరాలకు చేరిన ఆయన ప్రయాణం ఎలా సాగింది..? ఈ అపార సంపద వెనుక ఉన్న అసలు కారణాలేంటి..?
అపర కుబేరుడిగా అవతారం.. ఆస్తి ఎంతంటే?
ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీ’ ప్రకారం, సుందర్ పిచాయ్ నికర సంపద 1.1 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ.9,100 కోట్లు) చేరింది. మరోవైపు, ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్ల జాబితా ఆయన సంపదను 1.2 బిలియన్ డాలర్లుగా పేర్కొంది.గురువారం నాటి ట్రేడింగ్లో ఆల్ఫాబెట్ షేర్లు ఏకంగా 4.1% మేర లాభపడటంతో పిచాయ్ సంపద అమాంతం పెరిగింది.
సంపద వెనుక అసలు కారణాలివే…
ఆల్ఫాబెట్ అద్భుత ప్రదర్శన: 2023 నుంచి ఆల్ఫాబెట్ కంపెనీ షేర్లు అప్రతిహతంగా రాణిస్తున్నాయి. ఈ కాలంలో సంస్థ మార్కెట్ విలువ ఏకంగా ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా పెరిగి 2 ట్రిలియన్ డాలర్లను దాటింది.
త్రైమాసిక ఫలితాల జోష్: బుధవారం వెల్లడించిన రెండో త్రైమాసిక ఫలితాలలో కంపెనీ అంచనాలను మించి రాణించింది. కేవలం మూడు నెలల్లో కంపెనీ ఆదాయం 96.4 బిలియన్ డాలర్లుగా, లాభం 28.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభంజనం: గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గణనీయమైన పెట్టుబడులు పెడుతూ, అద్భుతమైన ప్రగతిని సాధిస్తోంది. ఇది ఆ సంస్థ షేర్ల విలువను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ALSO READ: https://teluguprabha.net/business/amazon-great-freedom-sale-dates-announced-check-exclusive-deals-here/
సాధారణ ఉద్యోగి నుంచి సీఈఓగా:
తమిళనాడులోని మదురైలో రెండు గదుల అపార్ట్మెంట్లో పెరిగిన సుందర్ పిచాయ్ ప్రయాణం ఎందరికో ఆదర్శం. 1993లో ప్రతిష్టాత్మక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో స్కాలర్షిప్ సాధించి అమెరికా వెళ్లారు. 2004లో గూగుల్లో ఒక సాధారణ ఉద్యోగిగా చేరిన ఆయన, తన అసాధారణ ప్రతిభతో అంచెలంచెలుగా ఎదిగారు. గూగుల్ క్రోమ్, ఆండ్రాయిడ్, గూగుల్ డ్రైవ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తుల వెనుక ఆయన కీలక పాత్ర పోషించారు.ఆయన కృషికి గుర్తింపుగా 2015లో గూగుల్ సీఈఓగా, ఆ తర్వాత ఆల్ఫాబెట్ సీఈఓగా ఉన్నత పదవులు చేపట్టారు.
వ్యవస్థాపకుడు కాకున్నా.. అరుదైన ఘనత:
టెక్ రంగంలో మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్, ఎన్విడియా అధిపతి జెన్సెన్ హువాంగ్ వంటి వారు తమ కంపెనీలను స్థాపించడం ద్వారా వ్యవస్థాపక ఈక్విటీ వాటాలతో కుబేరులయ్యారు. కానీ, సుందర్ పిచాయ్ ఒక కంపెనీని స్థాపించకుండా, కేవలం తన ప్రతిభ, నాయకత్వ పటిమతో సీఈఓగా బిలియనీర్ల క్లబ్లో చేరడం అత్యంత అరుదైన ఘనతగా విశ్లేషకులు కొనియాడుతున్నారు.


