Lawcet Results Released: ఏపీ ప్రభుత్వం వరుసగా పరీక్షల ఫలితాలు విడుదల చేస్తోంది. పదో తరగతి నుంచి ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల వరకు ఫలితాలను ఒకదాని తర్వాత ఒకటి వెల్లడిస్తోంది. తాజాగా లాసెట్-2025 ఫలితాలను విడుల చేసింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 27,253 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 20,826 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు తెలిపారు. మొత్తం 95శాతం ఉత్తీర్ణత సాధించనట్లు పేర్కొన్నారు. మరోసారి బాలికలే టాపర్లుగా నిలిచి తమ ప్రతిభను చాటారని ప్రశంసించారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
అభ్యర్థులు తమ ఫలితాలను cets.apsche.ap.gov.in/LAWCET/ అనే అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఫలితాల లింక్పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదుచేసి ర్యాంక్ కార్టును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ‘మనమిత్ర’ వాట్సాప్ సర్వీస్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు. 9552300009 అనే వాట్సాప్ గవర్నెన్స్ నంబర్కు ‘Hi’ అని మెసేజ్ పంపాలి. అనంతరం ‘విద్యా సేవలు’ ఆప్షన్ను ఎంచుకుని, ‘ఏపీ లాసెట్ ఫలితాలు-2025’ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డును పొందవచ్చు.
అడ్మిషన్ల ప్రక్రియలో కీలకమైన ఈ ర్యాంక్ కార్డును భద్రపరుచుకోవాలని అధికారలు సూచించారు. కాగా రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం ఈ పరీక్షలను నిర్వహిస్తారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూన్ 5వ తేదీన ఈ పరీక్షను ఆన్లైన్ విధానంలో నిర్వహించారు. లాసెట్ పరీక్షలో సాధించిన ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్థులకు కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారు. త్వరలోనే ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకటించనుంది.