CMAT 2026 registration begins at NTA Website: కామన్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టు (సీమ్యాట్-2026) నోటిఫికేషన్ రిలీజైంది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రతి ఏటా నిర్వహిస్తుంది. ఈ టెస్టులో వచ్చిన స్కోరుతో 2026-2027 విద్యా సంవత్సరానికి గానూ దేశవ్యాప్తంగా ఉన్న మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటిలో సీమ్యాట్ ఒకటి. ఈ పరీక్ష స్కోరుతో దేశవ్యాప్తంగా వెయ్యి సంస్థల్లో ఎంబీఏ/పీజీడీబీఏ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్, ఎక్స్ఏటీ, శ్నాప్, ఎన్మ్యాట్.. తదితర పరీక్షల కంటే సీమ్యాట్ కొంచెం సులువుగానే ఉంటుంది. ఐసెట్, మ్యాట్ స్థాయిలో ప్రశ్నలు వస్తాయి. ఇతర రాష్ట్రాల్లోనూ మధ్యస్థాయి మేనేజ్మెంట్ సంస్థల్లో ఎంబీఏ కోర్సుల్లో చేరడానికి ఈ స్కోరు ఉపయోగపడుతుంది. అర్హత గల అభ్యర్థులు www.cmat.nta.nic.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత ప్రమాణాలివే..
డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు 2025 నవంబర్ 17లోపు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద జనరల్ అభ్యర్ధులు రూ.2,500, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఓబీసీ (నాన్క్రిమి లేయర్), మహిళలు, థర్డ్ జెండర్ అభ్యర్ధులు రూ.1250 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
రాత పరీక్ష విధానం ఇదే..
సీమ్యాట్ పరీక్ష మొత్తం 400 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఇందులో ఒక్కో సెక్షన్ నుంచి 20 చొప్పున మొత్తం 5 విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు చొప్పున కేటాయిస్తారు. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, ఇన్నొవేషన్ అండ్ ఆంత్రప్రెన్యూర్షిప్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. 3 గంటల వ్యవధిలో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికీ ఒక్కో మార్కు చొప్పున కోత విధిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
ఇంపార్టెంట్ డేట్స్..
దరఖాస్తుకు నవంబర్ 17 ఆఖరు..
సీమ్యాట్ పరీక్షకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 17లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 18లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, దరఖాస్తు సమయంలో ఏవైనా తప్పులుంటే నవంబర్ 20 నుంచి 22 మధ్య ఎటిట్ చేసుకోవచ్చు. ఇక, సీమ్యాట్ పరీక్ష తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.


