JEE Advanced results: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఈ ఏడాది మే 17న నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాలతో పాటు విద్యార్థుల ర్యాంకులను ఉదయం 10 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు ఐఐటీ రూర్కీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ఈ పరీక్షకు ఈసారి సుమారు 1.90 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. ఈ పరీక్షలో నిర్దేశిత కనీస అర్హత మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఐఐటీ సీట్ల రేసులో నిలుస్తారు.
జూన్ 2 నుంచి కౌన్సెలింగ్ షెడ్యూల్: ఫలితాల కోసం విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఫలితాల విడుదల అనంతరం జూన్ 2న నుంచి దేశవ్యాప్త సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్ల భర్తీకి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. ఐఐటీల్లో సీట్లకు జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకును ప్రామాణికంగా తీసుకుంటుండగా.. ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, స్పా వంటి ఇతర కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ ర్యాంకులను పరిగణనలోకి తీసుకుంటారు. దీని ద్వారా కింది విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
- భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు (IITs)
- జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలు (NITs)
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IIITs)
- స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA)
- కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే ఇతర సాంకేతిక విద్యాసంస్థలు (CFTIs)

