Bank recruitment process changes : ప్రభుత్వ బ్యాంకు కొలువు.. లక్షలాది మంది నిరుద్యోగ యువత కల. అందులో గ్రామీణ బ్యాంకు (RRB) ఉద్యోగం ఓ సురక్షితమైన తొలిమెట్టు. కానీ, ఇకపై ఆ మెట్టు మొదటిది కాదు, చివరిది కానుంది! ప్రభుత్వ బ్యాంకుల నియామక ప్రక్రియలో కేంద్ర ఆర్థిక శాఖ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఫలితాల వెల్లడి క్రమాన్ని తలకిందులు చేయాలని సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు ఈ ఆకస్మిక మార్పులకు కారణమేంటి? దీనివల్ల అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం పడనుంది?
సమస్య మూలం ఇక్కడే : ప్రస్తుతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు (RRB) సంబంధించిన నియామక పరీక్షలు, ఫలితాలు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇతర జాతీయ బ్యాంకులతో (PSU Banks) పోలిస్తే ముందుగా వెలువడుతున్నాయి. దీంతో, అభ్యర్థులు ముందుగా ఆర్ఆర్బీలలో ఉద్యోగంలో చేరి, ఆ తర్వాత వెలువడే ఎస్బీఐ, ఇతర బ్యాంకుల ఫలితాల్లో ఉత్తీర్ణులైతే, ఈ ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు.
వలసల (Attrition) సమస్య: ఈ పరిణామం, గ్రామీణ బ్యాంకులలో తీవ్రమైన సిబ్బంది కొరతకు, కార్యకలాపాలకు ఆటంకాలకు దారితీస్తోంది. శిక్షణ ఇచ్చి, సిద్ధం చేసిన ఉద్యోగులు కొద్ది నెలల్లోనే వెళ్లిపోవడంతో, ఆర్ఆర్బీలకు ఇది కొరకరాని కొయ్యగా మారింది.
ఆర్థిక శాఖ కొత్త ఫ్రేమ్వర్క్.. ఫలితాల క్రమం ఇకపై ఇలా : ఈ ‘వలస’ల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక సేవల విభాగం, నియామక ఫలితాల ప్రకటనలో ఓ కొత్త, తార్కిక క్రమాన్ని ప్రతిపాదించింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)కు కీలక సూచనలు జారీ చేసింది.
కొత్త ఫలితాల క్రమం:
మొదట ఎస్బీఐ (SBI) ఫలితాలు.. ఆ తర్వాత ఇతర జాతీయ బ్యాంకుల (PSU Banks) ఫలితాలు. చివరగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (RRBs) ఫలితాలు. “ముందుగా అన్ని ఆఫీసర్ స్థాయి పరీక్షల ఫలితాలను ఈ క్రమంలో విడుదల చేస్తారు. ఆ తర్వాత, క్లరికల్ స్థాయి పరీక్షల ఫలితాలను కూడా ఇదే పద్ధతిలో ప్రకటిస్తారు,” అని ఆర్థిక సేవల విభాగం స్పష్టం చేసింది.
ఎందుకీ మార్పు? ప్రయోజనాలేంటి : ఈ కొత్త విధానం వెనుక స్పష్టమైన వ్యూహం ఉంది. ఉత్తమమైన ఉద్యోగ అవకాశంగా భావించే ఎస్బీఐ ఫలితాలు ముందుగా రావడం వల్ల, అందులో ఎంపికైన అభ్యర్థులు నేరుగా అక్కడే చేరిపోతారు. ఆ తర్వాత, ఇతర జాతీయ బ్యాంకుల ఫలితాలు, చివరగా ఆర్ఆర్బీ ఫలితాలు వస్తాయి. దీనివల్ల, అభ్యర్థులు తమకు లభించిన ఉత్తమ అవకాశాన్ని ఎంచుకుని స్థిరపడతారని, ఆర్ఆర్బీలలో చేరి మధ్యలో మానేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇది గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి, వాటి కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఎంతగానో దోహదపడుతుంది. ఈ మార్పు, బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న లక్షలాది మంది అభ్యర్థుల వ్యూహాలపై, వారి ప్రాధాన్యతలపై కచ్చితంగా ప్రభావం చూపనుంది.

