AP Mega DSC 2025 Final List: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే 4 విడతలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టినప్పటికీ.. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకోలేదు. దీంతో డీఎస్సీ అభ్యర్ధుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. మరోవైపు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాలని కోరుతున్నారు. మరోవైపు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల తుది జాబితాను సెప్టెంబరు 12న విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు.
ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. డీఎస్సీ మెరిట్ జాబితా అనేది ఇప్పటికే విడులైంది. మూడో విడత ధ్రువపత్రాల పరిశీలనలో సుమారు 30 మంది అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారని అధికారులు తెలిపారు. వీరి స్థానంలో కొత్తవారిని ధ్రువపత్రాల పరిశీలనకు పిలిచినట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన కొలిక్కివస్తే.. నియామక పత్రాలు కార్యక్రమంపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
నాలుగు విడతలుకు గల కారణం: తుది ఎంపిక జాబితాను రూపొందించి సెప్టెంబర్ 12 నాటికి వెబ్సైట్లో ఉంచేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. 4 విడతలుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి అయితే 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు అవుతుంది. అయితే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 4 విడతలుగా చేయడానికి పల కారణాలు ఉన్నాయి. రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం ఒక్క పోస్టుకు ఒక్క అభ్యర్థిని మాత్రమే ధ్రువపత్రాల పరిశీలనకు తొలి విడతలో భాగంగా పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో తిరస్కరణకు గురైన అభ్యర్థుల స్థానంలో మిగితా వారిని పిలుస్తూ..దశల వారీగా ధ్రువపత్రాల పరిశీలన చేసినట్లుగా అధికారులు తెలిపారు. అయితే కొన్ని జిల్లాల్లో పోస్టులకు అభ్యర్థులు లేకపోవడంతో 700 వరకు పోస్టులు అలాగే మిగిలే ఉండే అవకాశం ఉంది. జిల్లాల వారీగా మిగిలిపోయిన పోస్టులను వచ్చే డీఎస్సీలో భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.


