Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఇప్పటికే వరుసగా నాలు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోశారు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ కు సీక్వెల్ గా రూపొందుతున్న అఖండ2 లో నటిస్తున్నారు. అఖండ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ గా సినిమా వస్తుండటంతో అఖండ2పై కూడా అటు బాలయ్య అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో భారీ అంచనాలున్నాయి.
మరీ ముఖ్యంగా బాలయ్య- బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ప్రతీ ఒక్కరిలో ఉన్న అంచనాలు ఇంకో లెవల్. ఆల్రెడీ వీరి కాంబినేషన్లో సినిమాలు వచ్చాయి. సింహ, లెజెండ్, అఖండ. ఈ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాయి. అఖండ2 వీరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమా. ఇప్పటికే ఒక హ్యాట్రిక్ హిట్స్ ను తమ ఖాతాలో వేసుకున్న బాలయ్య- బోయపాటి, ఇప్పుడు అఖండ2 తో సెకండ్ హ్యాట్రిక్ ను మొదలుపెట్టబోతున్నారు.
అఖండ 2 మూవీ మొదటి భాగానికి ఏమాత్రం తగ్గకుండా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వచ్చి తెగ వైరలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా అఖండ2 గురించి ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్గా మారింది. అఖండ2 లో తన గాడ్ అయిన బాలయ్య కోసం, బోయపాటి అదిరిపోయే ప్లాన్ వేశారని.. దీనిలో భాగంగానే అఖండ2లో బోయపాటి ఓ స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేయిస్తున్నారని సమాచారం.
ఈ సాంగ్ కోసం ఏ హీరోయిన్ ని ఫిక్స్ చేయాలో అని గట్టిగానే ఆలోచిస్తున్నారట. డాకు మహారాజ్ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెల తో బాలయ్య చేసిన దబిడి దిబిడి సాంగ్ మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకుంది. మొదట కాస్త నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత థియేటర్స్లో మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మరోసారి అఖండ 2లో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశినే తీసుకునే ప్లాన్ చేస్తున్నారట. నెక్ట్స్ షెడ్యూల్ లో ఈ స్పెషల్ సాంగ్ కి సంబంధించిన షూట్ జరపనున్నట్టు తెలుస్తోంది. దీనిపై త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ రానుంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.