Telangana: సినీ పరిశ్రమతో పాటు ప్రేక్షకులను ఇటీవలి కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం సినిమా టికెట్ ధరల పెంపు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వాల నుంచి తరచూ మెమోలు జారీ అవుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం తాజాగా తెలంగాణ హైకోర్టు దృష్టికి వెళ్లగా, కోర్ట్ దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
టికెట్ ధరలను పెంచే ప్రసక్తే లేదని సినిమాటోగ్రఫీ మంత్రి స్వయంగా ప్రకటించినప్పటికీ వాటికి అనుమతులు ఇచ్చేలా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా నిర్ణయం మారడం లేదని, మెమోలు జారీ చేసే అధికారికి నిబంధనలపై అవగాహన లేదా? అంటూ కోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది.
సంక్రాంతి సీజన్ నేపథ్యంలో పలు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ జాబితాలో ముందుగా ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ గురువారం అర్ధరాత్రి 11 గంటల తర్వాత మెమో జారీ కావడం వివాదాస్పదమైంది.
Also Read – Parasakthi Censor: ‘పరాశక్తి’కి సెన్సార్ బోర్డ్ గ్రీన్ సిగ్నల్..
మెమో ఉత్తర్వుల ప్రకారం జనవరి 9 నుంచి 11 వరకు మల్టీప్లెక్స్లలో టికెట్ ధరను రూ.132 వరకు, సింగిల్ స్క్రీన్లలో రూ.105 వరకు పెంచుకునే అవకాశం కల్పించారు. అలాగే జనవరి 12 నుంచి 18 వరకు మల్టీప్లెక్స్లలో రూ.89, సింగిల్ థియేటర్లలో రూ.62 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చారు.
ఈ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్ రేట్లు పెంచేలా మెమోలు జారీ చేసే అధికారం హోంశాఖ కార్యదర్శికి లేదని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన హైకోర్టు, మెమో జారీ చేసిన అధికారుల తీరుని తప్పు పట్టింది.

