Manchu Mohan Babu: తిరుపతి పరిధిలోని మోహన్బాబు విశ్వవిద్యాలయం వద్ద జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. విద్యార్థుల సమస్యలపై ఆందోళన చేపడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులను బలవంతంగా తరలించారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో నటుడు, విద్యాసంస్థల నిర్వాహకుడు మోహన్ బాబుకు చెందిన భద్రతా సిబ్బంది పాత్ర ఉందని ఎస్ఎఫ్ఐ నేతలు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అదనపు ఫీజులను వెంటనే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు యూనివర్సిటీ సమీపంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిరసనలు యాజమాన్యానికి ఇబ్బందికరంగా మారడంతో వారిని అక్కడి నుంచి తొలగించేందుకు బౌన్సర్లను ఉపయోగించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరసనలో పాల్గొన్న నాయకులను ఓ వాహనంలో బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం.
Also Read- Bandla Ganesh : పవన్ను తిడితే ఎమ్మెల్సీ పదవి.. బండ్లన్న ఏం చెప్పారంటే.?
ఈ విషయాన్ని గమనించిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు వేగంగా స్పందించి వాహనాన్ని చేజ్ చేశారు. చివరకు మోహన్ బాబుకు సంబంధించిన ఫామ్ హౌస్ వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావించిన బౌన్సర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
విద్యాసంస్థ ప్రాంగణంలో విద్యార్థి సంఘాల నాయకులపై ఇలాంటి చర్యలు జరగడం పట్ల పలు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఎంబీయూ యూనివర్సిటీ అధిక ఫీజులు వసూలు చేసిందని ఉన్నత విద్యామండలి నిర్ధారించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ప్రభుత్వం కూడా అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ యాజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతో విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాయి. తాజా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి తీవ్ర వివాదానికి దారితీసింది. మోహన్ బాబు తీరుపై విమర్శలు మళ్లీ తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read- Sharwanand: మరో సినిమాను ఫిక్స్ చేసిన శర్వానంద్..‘బైకర్’ కొత్త రిలీజ్ డేట్!

