మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’ (Kannappa) మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీని వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో వీఎఫ్ఎక్స్ పనుల ఆలస్యం కావడంతో సినిమా విడుదల ఆలస్యం కాగా.. తాజాగా మూవీలో కీలక సన్నివేశాలకు సంబంధించిన హార్డ్డ్రైవ్ మిస్ అయింది. దీనిపై ఇప్పటికే మూవీ యూనిట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్కు సంబంధించిన కీలక యాక్షన్ సీక్వెన్స్ హార్డ్డ్రైవ్లో ఉన్నట్లు ఫిల్మ్నగర్లో టాక్ వినిపిస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ‘జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ #హరహరమహదేవ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయన అభిమానులు, ప్రేక్షకులు ధైర్యంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందో మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. కోకాపేటకు చెందిన రెడ్డి విజయ్కుమార్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. కన్నప్ప చిత్రానికి కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్డ్రైవ్ను ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్నగర్లోని విజయ్కుమార్ కార్యాలయానికి పంపారు. ఈ పార్శిల్ను ఈ నెల 25న ఆఫీస్బాయ్ రఘు తీసుకున్నాడు. అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా హార్డ్డ్రైవ్ను చరిత అనే మహిళకు అప్పగించాడు. అప్పటి నుంచి వారు తప్పించుకుని తిరుగుతున్నారు. తమ ప్రాజెక్టుకు నష్టం కలిగించాలనే దురుద్దేశంతో రఘు, చరితలు కలిసి ఇలా చేస్తున్నారని విజయ్కుమార్ ఫిల్మ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హార్డ్ డిస్క్లో 1.30 గంటల సినిమా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.