తెలంగాణ ప్రభుత్వం గద్దర్ తెలంగాణ సినీ అవార్డులను(Gaddar Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల ప్రకటన సందర్భంగా ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్(Murali Mohan) తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఒకే తెలుగు సినిమాకు రెండు ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో వివాదాలకు తావివ్వకుండా ఓ అవగాహనకు రావాలని కోరారు. ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటిస్తే, మరుసటి ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించాలని హితవు పలికారు. ఈ పద్ధతి పాటించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని సూచించారు.
‘‘తెలంగాణలో ఈ సినిమాకు, ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ, మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. తెలుగు సినిమా పరిశ్రమ, ప్రేక్షకుల ఐక్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి” ఆయన విన్నపించారు. మరి మురళీమోహన్ విన్నపంపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులను ప్రకటించగా.. ఏపీ ప్రభుత్వం ఇంతకుముందు లాగే నంది అవార్డులను ఇస్తామని తెలిపింది.