NTR at Kantara Chapter 1 Pre Release Event: చిన్నతనంలో అమ్మమ్మ తనకు చెప్పిన కథలే ఇప్పుడు సినిమాగా రావడం ఎంతో సంతోషంగా ఉందని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. వెండి తెరపై చిన్ననాటి కథలను చూడటం ఆనందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ వేదికగా కాంతార చాప్టర్- 1 సినిమా ప్రీ రిలీజ్ వేడుకగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లతో పాన్ ఇండియా స్థాయిలో చరిత్ర సృష్టించిన సినిమా ‘కాంతార’. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్గా ‘కాంతార చాప్టర్- 1’ విడుదలకు సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ , అంతకు మించిన అంచనాలతో తెరకెక్కిన ‘కాంతార చాప్టర్- 1’ సినిమాను హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ సినిమాకు రిషబ్ శెట్టి కథానాయకుడే కాకుండా దర్శకుడు కూడా కావడం విశేషం. హీరోయిన్గా రుక్మిణీ వసంత్, కీలక పాత్రలో దిల్షాన్ దేవయ్య నటిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-og-movie-day-3-world-wide-collections/
కాగా ఇటీవలే రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ అయిన కాంతార-1 తెలుగు ట్రైలర్ మిలియన్ వ్యూస్తో దూసుకుపోయింది. ఈ క్రమంలో కాంతార- 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
“నాకు రెండు, మూడు ఏళ్ళ వయసులో అమ్మమ్మ గులిగా ఆటలు, పింజుర్లీ కథలు చెప్పేది. ఆ కథలను ఎప్పటికైనా చూడాలన్న కోరిక ఉండేది. ఈ రోజు రిషబ్ శెట్టీ ద్వారా నా కల సాకారం అవ్వడం సంతోషంగా ఉంది. వెండితెరపై చిన్ననాటి కథలు చూడటం భావోద్వేగాన్ని కలిగించింది. కథ తెలిసిన నేనే అంతలా ఎమోషనల్ అయితే కొత్తగా విన్నవారు ఎలా ఫీలవుతారో మాటల్లో చెప్పలేను.’ అంటూ చిత్ర బృందంపై ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు.
రిషబ్ శెట్టికి 24 డిపార్ట్మెంట్స్పై పట్టుందని ఎన్టీఆర్ కొనియాడారు. ఉడిపి వెళ్లినప్పుడు రిషబ్ మమ్మల్ని కుటుంబ సభ్యుడిలా చూసుకున్నారని చెప్పారు. ఆ సమయంలో కాంతార సినిమా షూటింగ్ కోసం ఎంత కష్టపడ్డారో ప్రత్యక్షంగా చూశానని.. ఓ పురాతన దేవాలయానికి మార్గం లేకపోతే రోడ్డు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చూసుకున్నారని కొనియాడారు. భారతీయ సినిమా చరిత్రలో కాంతారాకు ప్రత్యేక పేజీ ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు.
కాగా, గత కొన్ని రోజుల క్రితం ఓ యాడ్ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ గాయపడిన విషయం విదితమే.. అయితే, ప్రమాదం తీవ్రతరంగా కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో రిషబ్ శెట్టీతో కలిసి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్లో హాజరై అభిమానుల్లో ఎన్టీఆర్ ఉత్సాహాన్ని నింపారు. ఇక, అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించేందుకు సిద్ధంగా ఉంది.


