Telangana: ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ విడుదల సమయం దగ్గర పడుతున్నప్పటికీ, తెలంగాణలో ఇప్పటివరకు టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాకపోవడం అభిమానుల్లో తీవ్ర అసహనాన్ని కలిగిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు అంశాలపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇంకా వెలువడకపోవడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది.
టికెట్ హైక్ మరియు ప్రీమియర్ షోల నిర్వహణకు అనుమతులు రావాల్సి ఉండగా, అవి ఆలస్యం కావడంతో చిత్ర బృందం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నైజాంలో ప్రీమియర్స్ను సాధారణ ధరలతోనే నిర్వహించాలా? లేక ప్రీమియర్ షోలనే పూర్తిగా రద్దు చేసి, రెగ్యులర్ షోల కోసం టికెట్ పెంపు జీఓ వచ్చే వరకు వేచి చూడాలా? అనే అంశంపై చర్చ కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడం తెలంగాణ అభిమానుల్లో మరింత నిరాశను పెంచుతోంది. ఇతర రాష్ట్రాల్లో టికెట్లు వేగంగా అమ్ముడుపోతుండగా, తెలంగాణలో మాత్రం అనిశ్చితి నెలకొనడం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.
ఈ ఆలస్యం వల్ల అభిమానులే కాదు, భారీ బడ్జెట్తో చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను రూ.400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి భారీగా రూపొందించారు. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ‘ది రాజా సాబ్’ విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే స్పష్టత వస్తుందా? లేక మరింత ఆలస్యం జరుగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. పరిస్థితి ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.
Also Read – Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ట్రైలర్.. సంక్రాంతికి నవ్వించనున్న నవీన్ పొలిశెట్టి

