ప్రముఖ దర్శకుడు వివి వినాయక్(VV Vinayak) అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. ఇందులో భాగంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనేది ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ ప్రచారంపై వినాయక్ టీమ్ స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.
దర్శకుడు వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొంది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని విజ్ఞప్తి చేసింది. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే చివరిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశారు వినాయక్. కాగా దిల్, ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్, బన్నీ, అదుర్స్, ఖైదీ నెంబర్ 150 వంటి హిట్ సినిమాలతో సక్సెస్పుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అక్కినేని వారసుడు అఖిల్ను ‘అఖిల్’ మూవీ ద్వారా, బెల్లంకొండను ‘అల్లుడు శీను’ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.