Murder for girlfriend: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో తన గర్ల్ఫ్రెండ్ను ఫాలో చేస్తున్నాడన్న నెపంతో ఓ యువకుడు తన స్నేహితుడి ప్రాణాలు తీసాడు. ఈ ఘటనను పోలీసులు విచారించి వివరాలు వెల్లడించారు. 17 ఏళ్ల రెహాన్ అనే యువకుడు, వసీం అనే యువకుడి గర్ల్ఫ్రెండ్ను సోషల్ మీడియాలో అనుసరించడంతో అతనికి కోపం వచ్చింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటల తూటాలు వెల్లువెత్తాయి. ఈ ఘటనను వ్యక్తిగతంగా తీసుకున్న వసీం, రెహాన్ను హత్య చేయాలని నిశ్చయించుకున్నాడు.
హత్యకు ముందు పార్టీ, తర్వాత దారుణం
వసీం తన స్నేహితులైన సాహిల్, రాహిల్లను రెహాన్ను చంపేందుకు సహాయం చేయమని కోరాడు. సహాయం చేస్తే మద్యం పార్టీ ఇస్తానని లాలూచీ ఇచ్చినట్లు సమాచారం. ప్రణాళిక ప్రకారం, రెహాన్ను ఫోన్ చేసి సాహిల్, రాహిల్లు దగ్గరకు రప్పించారు. మొదట అతనికి చోలే భటూరేతో పార్టీ ఇచ్చారు. అనంతరం ట్రోనికా సిటీ సమీపంలోని ఎలైచిపూర్ గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ వారి ప్రణాళిక ప్రకారం సాహిల్ రెహాన్ చేతులు పట్టుకోగా, వసీం కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. అక్కడికక్కడే రెహాన్ ప్రాణాలు కోల్పోయాడు. హత్య అనంతరం ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.
మృతదేహం వెలుగు లోకి.. నిందితులు అరెస్టు
ఢిల్లీకి చెందిన రెహాన్ మృతదేహాన్ని మంగళవారం ఎలైచిపూర్ గ్రామ పరిధిలో పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, హత్యలో ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. కాగా ఇలాంటి హత్య కేసులు ఇటీవల కాలంలో మరింత తీవ్రతరం అవుతున్నాయి. చిన్న చిన్న కారణాలకే చాలా మంది హత్యకు పాల్పడుతున్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఈ దారుణాలు తీవ్రమవుతున్నాయి. క్షణికావేశాన్ని తగ్గించుకోకుండా ఘోరమైన పనులను పాల్పడుతున్నారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని మేము సూచిస్తున్నాము. క్షణికావేశాన్ని తగ్గించుకొని.. మాటలతో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాం.


