Road Accident Software Engineer Died: ఉన్నత చదువులు చదివి విదేశాల్లో కొలువు చేసుకుంటూ ఏడాదికోసారి స్వదేశానికి వచ్చే కొడుకు రాక కోసం వేయి కళ్లతో కన్నవారు ఎదురుచూస్తుంటారు. ఈ తల్లిదండ్రులు కూడా అలాగే ఎదురుచూశారు. బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం ఇంటికి వచ్చిన తమ కుమారుడిని చూసి ఆనందంతో పొంగిపోయారు. తమతో ఉన్నన్ని రోజులు ఎంతో సంతోషంగా గడిపారు. ఇక మళ్లీ అమెరికాకి బయలుదేరే సమయం ఆసన్నమైంది. కుటుంబీకులకు కన్నీటితో వీడ్కోలు పలుకుతూ విదేశానికి తిరుగు పయనమయ్యాడు. కానీ ఆ మార్గమధ్యలోనే అనంతలోకాలకు చేరుకున్నాడు. ఏలూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
Also Read: https://teluguprabha.net/telangana/mla-danam-nagender-react-to-kalvakuntla-kavitha-comments-on-kcr/
ముదినేపల్లి మండలం చినపాలపర్రు జాతీయ రహదారిపై శనివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న టిప్పర్ను కారు ఢీకొట్టడంతో యువకుడు అక్కడిక్కడే మృతి చెందాడు. వనదర్రు గ్రామానికి చెందిన జయరాం(27) అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం ఇటీవల స్వదేశానికి వచ్చిన జయరాం.. వేడుక అయిపోగానే శనివారం తెల్లవారుజామున రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరాడు.
Also Read: https://teluguprabha.net/telangana/hyderabad/newly-married-couple-commits-suicide-in-kukatpally/
అయితే కారు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో చినపాలపర్రు సమీపంలోకి రాగానే కారు రోడ్డుకి అపశవ్య దిశలో ప్రయాణించి ఆగి ఉన్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా.. జయరాం అక్కడికక్కడే మృతి చెందాడు. కారు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

