ACB raids at Narsingi: నార్శింగి మున్సిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నట్లు ఆరోపణలు రావడంతో.. అనిశా తనిఖీలు చేపట్టింది. టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది.
డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోదాలు: మంచిరేవులకు చెందిన వినోద్ అనే వ్యక్తి తన ప్లాట్ ఎల్ఆర్ఎస్ క్లీయర్ కోసం నార్శింగిలోని మున్సిపల్ కార్యాలయానికి గత కొన్ని రోజుల క్రితం వెళ్లాడు. అయితే ఎల్ఆర్ఎస్ క్లీయర్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక రూ. 10 లక్షల లంచం డిమాండ్ చేసింది. దీంతో వినోద్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు నార్శింగి మున్సిపల్ కార్యాలయానికి రహస్యంగా వెళ్లారు. టౌన్ ప్లానింగ్ అధికారి మనిహరీక రూ. 4 లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. కార్యాలయంలో గల రికార్డులను పరిశీలించిన అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


