Brother Killed for Insurance Money: మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే.. అందుకు రక్త సంబంధం మినహాయింపు కాదు. ఆస్తి కోసం తోడబుట్టిన వాళ్లను అతి కిరాతకంగా హతమార్చుతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కలవరం సృష్టిస్తున్నాయి. ఇంట్లో సంపాదించే తోడు హఠాన్మరణం చెందితే ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కోసం తీసుకొచ్చిన బీమా సొమ్ము కోసమూ హంతకులుగా మారుతున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన ఓ యాక్సిడెంట్ ఇందుకు ఉదాహరణ. ఈ కేసును ఛేదించిన పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. అన్న బీమా సొమ్ము కోసం తమ్ముడే హత్యకు పాల్పడ్డాడనే వాస్తవం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
నవంబర్ 29న రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి వెంకటేశ్(39) టిప్పర్ ఢీకొని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. యాక్సిడెంట్ కేసుగా ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మూడు రోజుల పాటు చేపట్టిన దర్యాప్తులో ఖంగు తినే వాస్తవాలు బయటకు రావడంతో పోలీసులు ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్నారు. ఫైనల్గా కేసును ఛేదించి మంగళవారం మీడియా ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టారు.
మృతుడి తండ్రి నరసయ్య పోలీసులకు అందించిన ఫిర్యాదు మేరకు.. ‘ప్రమాదం జరిగిన రోజు(శనివారం) రాత్రి వెంకటేశ్ టిప్పర్లో మట్టి తరలిస్తుండగా.. సడెన్గా బ్రేక్ డౌన్ అయింది. దీంతో టిప్పర్ ముందు భాగంలో నా కుమారుడు మరమ్మతులు చేస్తున్నాడు. ఇది గమనించని మృతుడి తమ్ముడు రమేష్ టిప్పర్ను ముందుకు నడిపించాడు. టిప్పర్ వెంకటేశ్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నరేష్ ప్రవర్తనపై అనుమానం రావడంతో తోతుగా విచారణ చేపట్టారు. అతని ఫోన్ను పరిశీలించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులుగా ఉన్నట్లు నిర్ధారించారు. వెంకటేశ్ హత్య కుట్రకు ప్రణాళికను నిందితులు ఫోన్లో రికార్డు చేసిన వీడియోను గుర్తించారు. హత్య తర్వాత దొరికిపోతే ముగ్గురూ శిక్ష అనుభవించేలా మాట్లాడుకుని వారు వీడియోలో కనిపించేలా రికార్డు చేశారు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, హత్యకు ముందు రెండు నెలల్లో వెంకటేశ్ పేరు మీద దాదాపు 10 కంపెనీల్లో నిందితుడు నరేష్ రూ. 4.14 కోట్ల విలువైన బీమా పాలసీ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా సొమ్ము కోసమే తోడబుట్టిన అన్నను చంపి ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
కాగా, సొంత అన్న పాలిట తమ్ముడు మరణ శాసనంగా మారడానికి గల కారణాలపై మీడియా సమావేశంలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వివరాలు వెల్లడించారు. ‘వెంకటేశ్కు మానసిక పరిపక్వత ఉంది. అతనికి వివాహం కాలేదు. మూడేళ్ల క్రితం నరేశ్.. రెండు టిప్పర్లు కొనుగోలు చేసి వ్యాపారం సాగిస్తున్నాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, షేర్ మార్కెట్లోనూ నిరాశ ఎదురు కావడంతో దాదాపు రూ. 1.5 కోట్ల మేర ఇతరులకు బాకీ పడ్డాడు. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక.. మానసిక స్థితి సరిగా లేని తన అన్ననే తన కష్టాలకు పరిష్కారంగా ఎంచుకున్నాడు. రెండు నెలల్లో వెంకటేశ్ పేరిట పలు కంపెనీల్లో ఇన్సూరెన్స్ చేయించాడు. అనంతరం ప్రణాళిక ప్రకారం టిప్పర్తో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించాడు. ఇందుకోసం రాకేశ్, ప్రదీప్లకు డబ్బు ఆశ చూపించి హత్యలో భాగం చేశాడు.’ అని సీపీ వివరించారు.

