Road Accident Six Year Gir Died: గల్లీ రోడ్లపై అతి వేగం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. నామమాత్రపు స్పీడ్తో వెళ్లాల్సిన రోడ్డుపై మెరుపు లాంటి వేగం.. అప్పటివరకూ ఆడుకుంటున్న చిన్నారిని రోడ్డుపై అమాంతం ఈడ్చుకెళ్లింది. పాఠశాలలు, మసీదులు ఎక్కువగా ఉండే ఆ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమైతే.. జన నివాసాలు ఉండే రోడ్లపై హై స్పీడ్తో వెళ్లడం మరో నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న ఓ ప్రమాదం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read: https://teluguprabha.net/health-fitness/is-coconut-water-safe-for-babies-under-one-year/
ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ జిల్లాలో గంజ్దుంద్వారా పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరేళ్ల బాలిక మృతి చెందింది. పాటియాలి రోడ్డులోని మొహల్లా పుర్బా థోక్లో రోడ్డు దాటుతున్న బాలిక ఐజా(6)ను వేగంగా వచ్చిన బుల్లెట్ బైక్ ఢీకొట్టడంతో.. చిన్నారిని కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మరణించగా.. బైకర్కు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, బుల్లెట్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. చనిపోయిన బాలికను గంజ్దుండ్వారా పట్టణంలోని పుర్బా థోక్ మొహల్లా నివాసి పర్వేజ్ కుమార్తె ఐజాగా గుర్తించారు. బాలిక మృతితో కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే బంధువుల ఇంటికి వచ్చిన చిన్నారి.. ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

కాగా, చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు బాధిత కుటుంబం నిరాకరించింది. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే గంజ్దుంద్వారా- పాటియాలి రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్గంలో మసీదులు, ఇస్లామియా పాఠశాలలు, వివాహ మందిరాలు ఎక్కువగా ఉన్నాయని.. పిల్లలు తరచూ ఈ రోడ్లపైకి వస్తుంటారని, రద్దీ ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఇలాంటి ప్రమాదాలు జరగవని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.


