Bus Accident in Saudi Arabia: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారతీయ ప్రయాణికులతో మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న బస్సును.. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దారుణ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులు సజీవదహనం అయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. బదర్ – మదీనా మధ్యనున్న ముఫరహత్ ప్రాంతంలో అర్థరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుందని సౌదీ అరేబియా ప్రకటించింది.
మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీయులే: మృతుల్లో అధికంగా భారతీయులు ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు. వీరిలో హైదరాబాదీయులే ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. మరణించిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల బస్సు.. డీజిల్ ట్యాంకర్ను ఢీకొనగానే రెండు వాహనాలు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయని తెలుస్తోంది. ఈ ఘోర ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడంపై సీఎం రేవంత్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించాలని అధికారుల ఆదేశించారు. ప్రయాణికుల్లో రాష్ట్రానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను సేకరించాలని సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డికి సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సీఎం ఆదేశించారు. మృతి చెందిన కుటుంబాలకు సహాయ కార్యక్రమాలను అందించాలని సూచించారు.

