Road Accident Maharashtra: నిశ్చితార్థ వేడుకకు బంధుమిత్ర సమేతంగా సంతోషంగా వెళ్తుండగా దారి కాచిన మృత్యువు 12 మందిని బలి తీసుకుంది. ఈ విషాదకర సంఘఠన ముంబయి- అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. 20 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: https://teluguprabha.net/crime-news/uttar-pradesh-multiple-road-accidents-17-dead-lakhimpur-kheri/
వధువు ఇంటికి సమీపంలోనే
మహారాష్ట్ర పరిధిలోని పాల్ఘర్ జిల్లా, దహను తాలూకా ధనివరి వద్ద సోమవారం ఘోర ప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న ఒక ఐషర్ ట్రక్కును వేగంగా వచ్చిన ఒక భారీ కంటైనర్ ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. దుర్ఘటనలో 12 మంది అక్కడికక్కడే మరణించారు. బాపూగావ్ నుంచి ధనివరిలోని వధువు ఇంటికి సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది.
వాహనదారులు, స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంబయి వైపు నుంచి వస్తున్న కంటైనర్ ట్రక్కు అతివేగంతో నియంత్రణ కోల్పోయి, పెళ్లి బృందం ఉన్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కంటైనర్ భాగం విడిపోయి ట్రక్కుపై పడింది. ఈ ప్రమాదంలో ఒక బైక్ కూడా నలిగిపోగా, దానిపై ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా మృతి చెందినట్లు సమాచారం.
Also Read: https://teluguprabha.net/telangana/bandi-bhagirath-pocso-case-investigation-update/
ఆప్తుల ఆర్తనాదాలు
ప్రమాద సమయంలో ట్రక్కులో దాదాపు 40 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. 20 మందికి పైగా గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రధాన ఆస్పత్రులకు తరలించారు. ఆప్తుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం శోకసంద్రంగా మారింది. ప్రమాదం కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు క్రేన్ సాయంతో వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు.

