Saturday, July 12, 2025
Homeనేరాలు-ఘోరాలుMurder in NTR district: తాగొచ్చి దౌర్జన్యం.. కొడుకుని చంపిన తండ్రి..!

Murder in NTR district: తాగొచ్చి దౌర్జన్యం.. కొడుకుని చంపిన తండ్రి..!

Father killed son: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో తన తల్లిదండ్రులను నిత్యం వేధిస్తున్న కొడుకును.. కన్న తండ్రే హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 35 ఏళ్ల గోళ్ల వెంకటనారాయణకు 15 ఏళ్ల క్రితం కృష్ణ కుమారితో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఐదేళ్ల క్రితం భార్య వెంకట నారాయణను విడిచి వెళ్లిపోవడంతో, అప్పటి నుంచి వెంకట నారాయణ తన తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతడు మద్యానికి బానిసయ్యాడు. గత కొంతకాలంగా మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధించడం, వారిపై దాడి చేయడం పరిపాటిగా మారింది. దీనితో తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభ అనుభవించినట్లు తెలుస్తోంది.

జూన్ 30న రాత్రి వెంకటనారాయణ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఎప్పటిలాగే తల్లిదండ్రులపై దౌర్జన్యం చేసినట్లు సమాచారం. కుమారుడి ప్రవర్తనతో విసిగిపోయిన తండ్రి గోళ్ల కృష్ణ, ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయారని… చేతికి దొరికిన చెక్క మొద్దుతో కుమారుడి తలపై బలంగా కొట్టారని తెలుస్తోంది. ఈ దాడితో వెంకటనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ దారుణ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. “కన్న తండ్రే కొడుకుని చంపాడంటే ఎంతగా బాధపడి ఉంటాడో ఊహించుకోవచ్చు” అని గ్రామస్థులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మద్యం కారణంగా కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతున్నాయో ఈ ఘటన మరోసారి నిరూపించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటన సమాజంలో మద్యం దుష్ప్రభావాలను మరోసారి కళ్ళకు కట్టింది. మద్యం సేవించి కుటుంబ సభ్యులను వేధించడం, వారిపై దాడులకు పాల్పడటం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు కుటుంబ సంబంధాలను నాశనం చేయడమే కాకుండా, తీవ్రమైన నేరాలకు దారితీస్తున్నాయి.

మద్యం అలవాటు ఉన్నవారికి సరైన కౌన్సిలింగ్, చికిత్స అందించడం, అలాగే సమాజంలో మద్యంపై అవగాహన కల్పించడం వంటి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ ఘటన గుర్తుచేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు, సామరస్యం పెంపొందించడం ద్వారా ఇలాంటి విషాద సంఘటనలను నివారించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News