Fire in hospital: బిహార్లోని ముజఫరాపూర్లో గురువారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక ప్రసాద్ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో పలువురు రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఊపిరాడక స్పృహతప్పిన రోగులు: ఆస్పత్రి అంతటా దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో వార్డుల్లో ఉన్న రోగులు, వారిని పరామర్శించడానికి వచ్చిన బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు రక్షించుకోవడానికి భయంతో బయటకు పరుగులు తీశారు. పొగ కారణంగా కొందరు ఊపిరాడక స్పృహతప్పినట్లు సమాచారం.
రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది: ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపు చేస్తూనే.. ఆస్పత్రిలో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. దీంతో 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

