Husband killed wife: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా కట్టుకున్న భార్యనే బ్యాట్తో కొట్టి చంపాడు.
అనుమానం పెనుభూతం: భార్యను భర్త హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కలకలం రేపింది. కేఎస్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట బ్రహ్మయ్య అనే వ్యక్తి తన భార్య కృష్ణవేణిని ఆదివారం ఉదయం బ్యాట్తో కొట్టి హత్య చేశాడు. కృష్ణవేణి కోహీర్ డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆమె భర్త వెంకట బ్రహ్మయ్య సాఫ్ట్ వేర్గా పనిచేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూతురు ఇంటర్మీడియట్ చదువుతుండగా.. కుమారుడు ఎనిమిదో తరగతి విద్యార్థి చదువుతున్నాడు.
అసలేం జరిగిందంటే: గత కొంత కాలంగా అమీన్పూర్లోని కేఎస్ఆర్ కాలనీలో కృష్ణవేణి బ్రహ్మయ్య దంపతులు జీవనం కొనసాగిస్తున్నారు. వారి జీవితం అన్యోన్యంగా సాగుతున్న క్రమంలో అనుమానం అనే పెనుభూతం వారి మధ్య చేరింది. దీంతో ఆ దంపతుల మధ్య గొడవలు మొదలైయ్యాయి. చినికి చినికి గాలి వానలా మారిన .. అనుమానం అనే పెనుభూతం వారి దాంపత్య జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. కృష్ణవేణికి ఇల్లీగల్ ఎఫైర్ ఉందనే అనుమానంతో బ్రహ్మం తరచూ వాగ్వాదానికి దిగేవాడని స్థానికులు చెబుతున్నారు.
కేఎస్ఆర్ కాలనీలో విషాద ఛాయలు: అయితే ఆదివారం ఉదయం కూడా ఇద్దిరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చింది. కోపోద్రిక్తుడైన బ్రహ్మయ్య ఇంట్లో ఉన్న బ్యాట్తో భార్య కృష్ణవేణిపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్య కృష్ణవేణి మృతి చెందడంతో వెంకట బ్రహ్మయ్య పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనతో కేఎస్ఆర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


