Husband Kills Wife Kushaiguda: భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు వారి ఉసురు తీస్తున్నాయి. ఫలితంగా వారి పిల్లల పరిస్థితి దయనీయంగా మారుతోంది. తాజాగా మేడ్చల్ జిల్లా, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కత్తితో దారుణంగా నరికి చంపి భర్త పరారైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. భార్యపై అనుమానంతో భర్త ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబీకులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, మోత్కూరు సమీపంలోని అడ్డగూడురుకు చెందిన శంకర్, మంజులకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు.
Also Read: https://teluguprabha.net/crime-news/suryapet-infant-death-parents-quarrel/
వివాహం తర్వాత జీవనోపాధి కోసం వారు ముంబయికి వెళ్లారు. పెళ్లయిన మూడు సంవత్సరాల వరకు సజావుగానే సాగిన వారి కాపురం.. తర్వాత అనుమానాలతో అల్లకల్లోలంగా మారింది. అనుమానం పెనుభూతంగా మారి మంజులపై శంకర్ తరుచూ గొడవలు పడేవాడు. భర్త వేధింపులు భరించలేక మంజుల వారం రోజుల క్రితం తన సోదరి రాణి ఇంటికి చేరుకుంది.
దీంతో శంకర్ కూడా తన పిల్లలతో కలిసి అక్కడికి వచ్చాడు. శుక్రవారం పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా.. శంకర్ కాంప్రమైజ్కు వచ్చాడు. ఇకపై భార్యను ఇబ్బంది పెట్టనని హామీ ఇచ్చి ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే, అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో శంకర్ కత్తితో విచక్షణారహితంగా మంజులను నరికాడు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని అక్కడికి చేరుకునేలోపే మంజుల మృతి చెందింది. శంకర్ పారిపోయాడు. కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


