Fire Accident In Indian Navy: భారత నౌకాదళం.. అరేబియా సముద్రంలో సంభవించిన ఆయిల్ ట్యాంకర్ అగ్నిప్రమాదం నుండి 14 మంది సిబ్బందిని రక్షించింది. గుజరాత్ లోని కాండ్లా ఓడరేవు నుండి ఒమన్లోని షినాస్కు 14 మంది భారతీయ సిబ్బందితో బయలుదేరిన పులావు జెండాతో ఉన్న MT యి చెంగ్ 6 (MT Yi Cheng 6) అనే ఆయిల్ ట్యాంకర్ లో మార్గం మధ్యలో ఇంజిన్ రూములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో నౌకలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో సిబ్బంది నిస్సహాయ స్థితిలో సముద్రంలో చిక్కుకుపోయారు.
సహాయం కోసం ఆయిల్ ట్యాంకర్ నుండి అందిన డిస్ట్రెస్ కాల్కు భారత నౌకాదళం తక్షణమే స్పందించింది. ఒమన్ గల్ఫ్లో గస్తీ కాస్తున్న భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తబార్ (INS Tabar) స్టెల్త్ యుద్ధనౌక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. నౌకలోని 13 మంది భారతీయ నావికాదళ సిబ్బంది మరియు ఐదుగురు ఇతర సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, మంటలను అదుపు చేశారు.
భారత నౌకాదళం చేపట్టిన సమర్థవంతమైన సహాయక చర్యల వల్ల ఆయిల్ ట్యాంకర్ లోని మొత్తం 14 మంది సిబ్బందిని సురక్షితంగా రక్షించగలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.