దక్షిణ కోల్కతాలోని ఓ లా కాలేజీలో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదులో వెల్లడైన వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
24 ఏళ్ల బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..
ప్రధాన నిందితుడి వివాహ ప్రతిపాదనను తాను నిరాకరించినందుకే ఈ దారుణం జరిగిందని సదరు బాధితురాలు తెలిపింది. తాను అప్పటికే ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ప్రధాన నిందితుడు, తన సీనియర్ అయిన మోనోజిత్ మిశ్రా, ఈ నేరానికి పాల్పడటంలో జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ అలియాస్ ప్రమిత్ ముఖోపాధ్యాయ అనే ప్రస్తుత విద్యార్థులు అతనికి సహకరించారని బాధితురాలు వివరించింది. ఆ ముగ్గురూ కలిసి కాలేజీ క్యాంపస్లోని గార్డు గదిలో తనపై సామూహిక అత్యాచారం చేశారని ఆమె తెలిపింది.
దుండగులు ముందుగా తన ప్రియుడికి హాని చేస్తానని, అలాగే తన తల్లిదండ్రులను వివిధ కేసుల్లో బుక్ చేస్తారని బెదిరించి తనపై దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. తాను ఎంత పోరాడిన లాభం లేకపోయిందని, తీవ్రంగా గాయ పడ్డానని చెప్పింది. తనకు శ్వాస ఆడకపోయినా, ఆసుపత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడినా నిందితులు కనికరించలేదని తెలిపింది.
కాలేజీ ప్రధాన గేట్ను మూసేసి, గార్డు కూడా నిస్సహాయంగా ఉన్నాడని బాధితురాలు పేర్కొంది. ప్రధాన నిందితుడి కాళ్లపై పడి బతిమలాడినా తనను వదలలేదని, తిరిగి గార్డు గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశారని ఆమె వెల్లడించింది. ఈ దారుణాన్ని నిందితులు వీడియో తీశారని, ఆ వీడియోలను బయటపెడతామని బెదిరించి తనను మౌనంగా ఉండమని బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు తెలిపింది. తాను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు దుండగులు హాకీ స్టిక్తో కొట్టడానికి ప్రయత్నించారని కూడా ఆమె పేర్కొంది. ఎలాగైనా తనకు న్యాయం కావాలని ఆమె తన ఫిర్యాదులో వేడుకుంది.
ఇదీ జరిగింది..
బాధితురాలు బుధవారం (జూన్ 25) న పరీక్ష ఫారాలు నింపడానికి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాలేజీకి వచ్చింది. కాలేజీ యూనియన్ గదిలో కూర్చున్న ఆమెను నిందితులు బలవంతంగా గార్డు గదికి తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొంది. కస్బా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు వేగంగా స్పందించి ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు మోనోజిత్ మిశ్రా (31), పూర్వ విద్యార్థి, ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ ఛాత్ర పరిషద్ (TMCP) దక్షిణ కోల్కతా జిల్లా యూనిట్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. ఇతర నిందితులు మొదటి సంవత్సరం విద్యార్థులు జైబ్ అహ్మద్ మరియు ప్రమిత్ ముఖర్జీగా గుర్తించారు.
ఈ ఘటన జూన్ 25న రాత్రి 7:30 నుండి 10:50 గంటల మధ్య కాలేజీ ప్రాంగణంలో జరిగినట్లు ఆరోపణలున్నాయి. పోలీసులు బాధితురాలికి ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.
జాతీయ మహిళా కమిషన్ స్పందన:
జాతీయ మహిళా కమిషన్ (NCW) ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించింది. ఛైర్పర్సన్ విజయ రహత్కర్ కోల్కతా పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల ప్రకారం దర్యాప్తును వేగవంతం చేయాలని కమిషన్ కోరింది. బాధితురాలికి పూర్తి వైద్య, మానసిక, చట్టపరమైన మద్దతును అందించాలని, అలాగే భారతీయ నాగరిక సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 396 కింద పరిహారం అందించాలని పేర్కొన్నారు.