Man Arrested In Bengaluru For Killing Wife With Rolling Pin: కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన ఘటన వెలుగు చూసింది. చపాతీలు చేసే రోలింగ్ పిన్ (rolling pin)తో భార్యను తీవ్రంగా కొట్టి చంపిన వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రీతి సింగ్ (28), ఆమె భర్త ఛోటా లాల్ సింగ్ (32) తమ ఇద్దరు పిల్లలతో కలిసి నగరంలోని చొక్కసంద్రలో నివసిస్తున్నారు. వీరిద్దరూ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.
కంపెనీలో హెల్పర్గా పనిచేస్తున్న ఛోటా లాల్ సింగ్, ఎలాంటి కారణం లేకుండానే తన భార్య ప్రీతిని తరచుగా మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. సెప్టెంబర్ 24న మధ్యాహ్నం భోజనం కోసం ప్రీతి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, భర్త ఎప్పటిలాగే గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు, చపాతీలు చేసే రోలింగ్ పిన్తో ప్రీతి తలపైనా, శరీరంపైనా తీవ్రంగా కొట్టాడు.
ALSO READ: Unnatural Sex Dispute: కేరళలో సగం కాలిపోయిన మృతదేహం లభ్యం.. ‘అసహజ శృంగారమే’ కారణం?
నిజం చెప్పిన పిల్లలు, అబద్ధం చెప్పిన భర్త
తీవ్రంగా గాయపడిన ప్రీతిని భర్త టి. దాసరహళ్లిలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే, దాడి విషయాన్ని దాచిపెట్టడానికి, తన భార్య భవనంపై నుంచి పడిపోయిందని డాక్టర్లకు అబద్ధం చెప్పాడు.
అయితే, ఈ దారుణాన్ని చూసిన పిల్లలు ఇద్దరూ వారి తల్లి పనిచేసే కంపెనీ యజమాని వద్దకు వెళ్లి, తమ తండ్రే తమ తల్లిని కొట్టాడని నిజం చెప్పారు. దీంతో, కంపెనీ యజమాని పీన్యా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రోలింగ్ పిన్తో భార్యను దారుణంగా కొట్టినట్లు అతను నేరం అంగీకరించాడు. అనంతరం పోలీసులు అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
సెప్టెంబర్ 24న దాడికి గురైన ప్రీతి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్టోబర్ 2న మరణించినట్లు పోలీసులు తెలిపారు.


