Married woman suicide: కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలు సైతం తీవ్ర విషాదానికి దారి తీస్తాయి. క్షణికావేశంలో దారుణాలకు పాల్పడేలా చేస్తాయి. ఎంతటి కఠిన సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. కానీ ఆలోచించకుండానే ఆవేశంలో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తున్నారు. హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటన ఒకటి వికారాబాద్ జిల్లా(Vikarabad District)లో చోటుచేసుకుంది. వంటరాదని, చదువుకోలేదని భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య(Suicide) చేసుకుంది.
కోటి ఆశలతో మెట్టింటికి: వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని మల్లెమోనిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివలింగం అనే వ్యక్తికి ధరూర్ మండలంలోని గంగారం గ్రామానికి చెందిన శిరీష(21)తో ఇటీవల వివాహం జరిగింది. దీంతో ఆ యువతి కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెట్టింది. కానీ ఆమె ఆశలు అడియాశలయ్యాయి. భర్త వేధింపులు మొదలైయ్యాయి. తరుచుగా నీకు వంట సరిగ్గా రాదు.. తన కంటే తక్కువ చదువుకున్నావు.. లాంటి సూటిపోటి మాటలతో భర్త వేధింపులు మొదలుపెట్టాడు. అంతే కాదు నువ్వు నీ పుట్టింటికి వెళ్లి వంటలు నేర్చుకుని రాపో అంటూ తెగ ఇబ్బందికి గురిచేసేవాడు.
పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి: వంట నేర్చుకుని రాపో అంటూ ఆ యువతిని తన పుట్టింట్లో వదిలిపెట్టాడు. తరవాత రోజు ఫోన్ చేయగా నువ్వు నాకు అక్కర్లేదు అక్కడే చావు అంటూ దూశించడంతో శిరీష పుట్టింట్లో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోయింది. ఇక చేసేది ఏమీ లేక విసిగిపోయిన శిరీష ఆత్మహత్య చేసుకుంది. దీంతో భర్త వేధింపుల కారణంగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శిరీష తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

