Murder for Match Stick Delhi Crime: చిన్నపాటి వివాదాలకే నియంత్రణ కోల్పోయి, ఆగ్రాహవేశాలకు గురై ప్రాణాలు తీయడం చూస్తున్నాం. ఫలితంగా జైలు పాలై జీవితాన్ని ఆగం చేసుకుంటున్నారు. తాజాగా అగ్గిపుల్ల కోసం ఓ యువకుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వసంత్ కుంజ్ నార్త్ ప్రాంతంలో అగ్గిపుల్ల విషయంలో తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బీడీ వెలిగించడానికి అగ్గిపుల్ల అడిగినందుకు 21 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపారు. మృతుడు 21 ఏళ్ల కరణ్గా పోలీసులు గుర్తించారు. కరణ్ కుటుంబంతో కలిసి జేజే బంధు క్యాంప్ మురికివాడల్లో నివసిస్తున్నాడు.
మంగళవారం రాత్రి భోజనం తర్వాత, కరణ్ తన తమ్ముడు రాజుతో కలిసి వాకింగ్కు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత, కరణ్ రక్తస్రావంతో ఇంటికి తిరిగి వచ్చి కుప్పకూలిపోగా.. గమనించిన కుటుంబీకులు భయాందోళనకు గురై వెంటనే అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే కరణ్ చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం..
జేజే బంధు క్యాంప్ మురికివాడల్లో కరణ్ కొంతమంది యువకులతో గొడవ పడ్డాడు. బీడీ వెలిగించుకోవడానికి కరణ్ అగ్గిపుల్ల అడగ్గా.. అది కాస్త వివాదానికి దారితీసింది. గొడవ కాస్త ముదిరి.. గ్యాంగ్లోని ఒక యువకుడు కత్తి తీసి కరణ్ మెడపై దాడి చేశాడు. ఘటనలో కరణ్కి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. సంఘటనాస్థలం సమీపంలోని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన చేసిన అనంతరం నిందితుడు పరారీ కాగా.. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.

