Saturday, November 15, 2025
Homeనేరాలు-ఘోరాలుBurnt Odisha Girl Dies : నిప్పంటిన పదిహేనేళ్ల బాలిక మృతి... మరణంపై వీడని...

Burnt Odisha Girl Dies : నిప్పంటిన పదిహేనేళ్ల బాలిక మృతి… మరణంపై వీడని మిస్టరీ!

Odisha girl death investigation : ఒడిశాలోని పూరీ జిల్లాలో అమానవీయ ఘటనలో తీవ్రంగా గాయపడిన 15 ఏళ్ల బాలిక, పదిహేను రోజుల పాటు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఈ విషాద ఘటన యావత్ రాష్ట్రాన్ని కదిలించగా, పోలీసుల దర్యాప్తు తీరు ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపింది. బాలికకు నిప్పంటించడంలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని పోలీసులు తేల్చిచెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది..? పోలీసుల వాదనలో నిజమెంత..?

- Advertisement -

ఘటనా స్థలం నుంచి ఢిల్లీ ఎయిమ్స్ వరకు: జులై 19న పూరీ జిల్లా భార్గవి నది ఒడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. స్నేహితురాలి ఇంటి నుంచి తిరిగి వస్తున్న బాలికను ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, ఆమెపై మండే పదార్థం పోసి నిప్పంటించారని బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 70 శాతానికి పైగా కాలిన గాయాలతో ఉన్న బాలికను స్థానికులు రక్షించి మొదట పిపిలీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, ఆ తర్వాత భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం జులై 20న ప్రత్యేక విమానంలో ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆమెకు రెండుసార్లు శస్త్రచికిత్సలు జరిగినా, చివరకు చికిత్స ఫలించక శనివారం రాత్రి మరణించింది.

పోలీసుల దర్యాప్తులో మలుపు: ఈ కేసును మొదట తీవ్రంగా పరిగణించిన పోలీసులు, 15 రోజుల దర్యాప్తు అనంతరం ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. బాలికకు నిప్పుపెట్టుకోవడంలో బయటి వ్యక్తుల ప్రమేయం లేదని, ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో నమోదు చేశామని తెలిపారు. ఈ ప్రకటనతో కేసు కొత్త మలుపు తిరిగింది. బాలిక తండ్రి కూడా, తన కుమార్తె మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని, ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరడం గమనార్హం. అయితే, బాలిక తల్లి మాత్రం తన బిడ్డను ముగ్గురు వ్యక్తులు అపహరించి నిప్పంటించారని ఆరోపిస్తూనే ఉన్నారు.

రాజకీయ దుమారం  సుప్రీంకోర్టు స్పందన: ఈ ఘటనపై ఒడిశాలో రాజకీయ దుమారం రేగింది. ప్రతిపక్ష బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితికి ఇది నిదర్శనమని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బాలిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సైతం స్పందించి, దీనిని “సిగ్గుచేటు, దురదృష్టకరం”గా అభివర్ణించింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది.

ప్రభుత్వం, ప్రముఖుల సంతాపం: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ బాలిక మృతికి తీవ్ర సంతాపం తెలిపారు. బాలికను కాపాడేందుకు ప్రభుత్వం, ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సీఎం విచారం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad