Road accident at Begumpet: హైదరాబాద్ నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హెవీ లోడ్తో వెళ్తున్న ట్రక్.. మహీంద్రా థార్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో థార్ వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. అయితే థార్ వాహనంలో ఎంతమంది ఉన్నారనేది తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లోని బేగంపేట్ బస్ స్టాప్ సమీపంలో ఇవాళ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ వైపు నుంచి వస్తున్న హెవీ లోడ్ ట్రక్.. మహీంద్రా థార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో థార్ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది. ప్రభావం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో హెవీ లోడ్ ట్రక్ సైతం బోల్తా పడింది. స్థానికులు అందించిన సమాచారంతో.. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే థార్ వాహనంలో ఎంతమంది ఉన్నారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.
భారీగా ట్రాఫిక్ జామ్: ఈ ప్రమాదంతో బేగంపేట్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో తొలగించిన పోలీసులు.. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాద సమయంలో వాహనాల రాకపోకలు తక్కువగా ఉండటంతో ప్రాణ నష్టం తప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

