Accident at Chityal: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దసరా పండుగ అనంతరం సొంతూరు నుంచి నగరానికి బయల్దేరిన ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సుల మధ్య కారు ఇరుక్కుపోయింది. ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామకు చెందిన గుర్రె జోష్ కుమార్, పైల మురళితో పాటు హైదరాబాద్ కొండాపూర్కు చెందిన చల్లా శ్రీహర్ష నగరంలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-reacted-to-the-increase-in-rtc-bus-charges/
ముగ్గురూ కలిసి ఆదివారం తెల్లవారుజామున కారులో నందిగామ నుంచి హైదరాబాద్కి బయలుదేరగా.. చిట్యాల సమీపంలో కల్వర్టు వద్ద ముందు వెళ్తున్న ప్రైవేట్ బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనుక ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల కారు కూడా ఆగిపోగా.. అయితే అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో ప్రైవేటు బస్సు కారును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. దీంతో రెండు బస్సుల మధ్య కారు ఇరుక్కుని నుజ్జునుజ్జయిపోయింది.
ప్రమాదంలో కారులో ఉన్న శ్రీహర్ష తలకు బలమైన గాయాలయ్యాయి. జోష్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీశారు. వారిని చికిత్స నిమిత్తం నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. కాగా, మెరుగైన చికిత్స కోసం శ్రీహర్షను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


