Road accident: సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 65పై శనివారం ఉదయం పెను ప్రమాదం సంభవించింది. సదాశివపేట బైపాస్ రోడ్డులోని ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో సుమారు 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన తీరు: జహీరాబాద్ నుంచి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సదాశివపేట నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న లారీ బైపాస్ రోడ్డులోని మలుపు వద్దకు రాగానే ఒక్కసారిగా ఢీకొన్నాయి. ప్రమాద ధాటికి రెండు వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ చెల్లాచెదురుగా పడిపోయారు.
సహాయక చర్యలు: సమాచారం అందుకున్న వెంటనే సదాశివపేట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో బస్సులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసి.. అంబులెన్స్లలో సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.
Also read-Vikarabad: మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. వేధింపులే కారణమా?
భారీగా నిలిచిపోయిన వాహనాలు: ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.

