Snowstorm on Everest Mount: ప్రపంచంలోనే అతిపెద్ద పర్వతంగా పేరున్న ఎవరెస్ట్పై మంచు తుపాను బీభత్సం సృష్టించింది. దీంతో వేల అడుగుల ఎత్తులో దాదాపు 1000 మంది పర్వతారోహకులు మంచులో చిక్కుకుపోయారు. వెంటనే స్పందించిన అధికారులు వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.
350 మందిని రక్షించిన రెస్క్యూ టీం: టిబెట్లో ఎవరెస్ట్ పర్వతం తూర్పువాలు గుండా గత రెండు రోజుల నుంచి దట్టంగా మంచు కురుస్తోంది. ఆదివారం నాటికి అది మంచు తుపానుగా మారి బీభత్సం సృష్టించింది. దీంతో దాదాపు 1000 మందికి పైగా క్యాంప్ సైట్ల వద్ద చిక్కుకుపోయారు. వెంటనే వారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 350 మందిని రక్షించి క్యుడాంగ్ అనే చిన్న టౌన్షిప్కు తరలించినట్లుగా అధికారులు తెలిపారు. ఎవరెస్ట్ పైకి వెళ్లే మార్గాల్లో భారీగా మంచు చరియలు పడి దారులు మూసుకుపోవడంతో.. సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. పర్వతారోహకులను రక్షించేందుకు వందలాది మంది స్థానికులు రెస్క్యూ సిబ్బందితో కలిసి శ్రమిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/national-news/jaipur-hospital-fire-icu-8-dead-negligence-alleged/
హైపోథెర్మియా బారినపడినట్లు వెల్లడి: సాధారణంగా ఈ వైపు నుంచే పర్వతారోహకులు ఎక్కువగా ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు చైనాలో సెలవులు కావడంతో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉందని అక్కడి స్థానిక అధికారులు తెలిపారు. అదే సమయంలో మంచు తుపాను సంభవించడంతో వీరంతా పర్వతంపై చిక్కుకుపోయి ఉంటారని అన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో హైకర్లు ఇబ్బందులు సైతం పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది హైకర్లు హైపోథెర్మియా బారినపడినట్లు రెస్క్యూ బృందం అధికారులు వెల్లడించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శనివారం నుంచి ఎవరెస్ట్ పైకి వెళ్లేందుకు ఎవరిని అనుమతించలేదని అధికారులు తెలిపారు. సాధారణంగా అక్టోబరులో ఈ మంచు పర్వతంపై ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎక్కువ ఉంటాయని అన్నారు.

