Hussain Sagar: అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలి రాలేనన్న ఆమె నిజాయితీకి.. ప్రస్తుత సమాజం పెళ్లి సంబంధాల రూపంలో అడ్డంకులు సృష్టించింది. ఆ మనోవేదన భరించలేక ఓ యువ సాఫ్ట్వేర్ హుస్సేన్సాగర్లో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన స్థానికులను కలచివేస్తోంది. మేడ్చల్ జిల్లా కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి (26) ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో.. మతిస్థిమితం లేని తల్లి సరస్వతి బాధ్యతను విజయలక్ష్మి భుజానికెత్తుకుంది. మైత్రినగర్లో నివాసముంటున్న ఆమె.. తల్లికి అన్నీ తానై సేవలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకునేది.
పెళ్లి సంబంధాలు తిరస్కరణకు గురవ్వడమే కారణం: విజయలక్ష్మికి ఇటీవల వివాహ సంబంధాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే వివాహం తర్వాత కూడా తన తల్లి తనతోనే ఉంటుందని ఆమె నిబంధన పెట్టేది. అమ్మను ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేక ఆమె చెప్పిన ఈ షరతుకు వరుడి పక్షం అంగీకరించకపోవడంతో సంబంధాలు అన్నీ తృటిలో తప్పిపోయేవి. తన తల్లి వైకల్యం కారణంగానే తన పెళ్లికి అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె తీవ్ర మనోవేదనకు లోనైంది.
Also read-Accident: హెల్మెట్ లేని ప్రయాణం.. గాల్లో కలిసిన ముగ్గురు యువకుల ప్రాణాలు!
అదృశ్యం.. విషాదాంతం: మనోవేదనతో ఉన్న విజయలక్ష్మి శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. బంధువుల ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. సోమవారం హుస్సేన్సాగర్లో ఒక యువతి మృతదేహం తేలడంతో.. లేక్ పోలీసులు కూకట్పల్లి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు అది విజయలక్ష్మి మృతదేహమేనని గుర్తించడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.

