SOT police attack on drug party: హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియాపై ఎస్వోటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నగర శివారులోని గచ్చిబౌలి, టీఎన్జీవో కాలనీలోని ఎస్ఎం లగ్జరీ గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్లో జరుగుతున్న ఓ డ్రగ్ పార్టీపై పోలీసులు మెరుపు దాడి చేశారు. స్పాట్లోనే 11 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఆరుగురు డ్రగ్స్ సరఫరాదారులుతో పాటు ఐదుగురు డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు. పరారీలో మరో 8 మంది ఉన్నట్టుగా పేర్కొన్నారు. పట్టుబడిన వారిలో ఐటీ ఉద్యోగులు, ఆర్కిటెక్టులు, డ్రైవర్లు, డీజే ప్లేయర్లు, ఫొటోగ్రాఫర్లు వంటి వివిధ వృత్తుల వారు సైతం ఉన్నట్టుగా పోలీసులు తెలిపారు.
కర్ణాటక నుంచి డ్రగ్స్ సరఫరా: ఈ దాడిలో కీలక మాఫియా బృందం అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ పార్టీ కోసం కర్ణాటక నుంచి మాదకద్రవ్యాలు తెచ్చి హైదరాబాద్ యువతకు అమ్ముతున్న స్మగ్లర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఖ్య నిందితులు గుత్తా తేజ కృష్ణ, లోకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తనతోపాటుగా డ్రగ్స్ సరఫరా చేసే ఇద్దరు నైజీరియన్లను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరాలో నైజీరియన్లే ప్రధాన పాత్ర పోషించినట్టుగా పోలీసులు గుర్తించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-teacher-class-room-video-viral-in-social-media/
భారీగా ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం: ఈ దాడిలో నిందితుల నుంచి భారీగా ఎండీఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అంతే కాకుండా గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 31.2 గ్రాముల ఎండీఎంఏ, 3 గ్రాముల గంజాయిని ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని మొత్తం విలువ సుమారుగా రూ. 6. 51 లక్షలుగా ఉండనుందని సమాచారం. అంతే కాకుండా అరెస్ట్ అయిన వారి నుండి.. పలు కీలక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తోంది. వారి నుంచి మొబైల్ ఫోన్లు, 2 బైకులు, డాంగిల్స్, జీపీఎస్ కార్డు రీడర్ను సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్ట్ అయిన వారి వివరాలు: డ్రగ్స్ పార్టీలో అరెస్ట్ అయిన వారిలో గుత్తా తేజ కృష్ణ, సాజీర్, వెన్నెల రవి కిరణ్, మన్నే ప్రశాంత్, పి హర్షవర్ధన్ రెడ్డి, పకనాటి లోకేష్ రెడ్డి, పృథ్వి విష్ణువర్ధన్, కార్ల పొడి వెస్లీ సుజిత్, గుండబోయిన నాగార్జున, మేకల గౌతం, గుంటక సతీష్ రెడ్డి ఉన్నారు. అయితే వీరందరిపై ఎస్వోటీ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో డ్రగ్స్ సరఫరా వ్యవస్థ మూలాలను ఛేదించేందుకు ఈ ఆపరేషన్ దోహదపడుతుందని పోలీసులు పేర్కొన్నారు.


