Man killed friend over money : పుట్టినరోజు సంబరాల్లో విషాదం నెలకొంది. కేవలం యాభై రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ, ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. క్షణికావేశంలో స్నేహితుడే స్నేహితుడి పాలిట యముడయ్యాడు. మధ్యలో సర్దిచెప్పడానికి వెళ్లిన మరో స్నేహితుడు ప్రాణాలు కోల్పోయిన ఈ విషాద ఘటన, గుజరాత్లోని సూరత్లో తీవ్ర కలకలం రేపింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? అంతటి ఘోరానికి దారితీసిన ఆ యాభై రూపాయల కథేంటి..?
అసలేం జరిగిందంటే : సూరత్ జిల్లా, పాండేసరలోని లక్ష్మీనగర్లో నివసిస్తున్న భగత్ సింగ్ (28), తన స్నేహితుడైన బిట్టు కాశీనాథ్ సింగ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు.
పార్టీ కోసం ప్లాన్: స్నేహితులంతా కలిసి అల్తాన్లోని ఓ హోటల్లో పార్టీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
రూ.50 కోసం గొడవ: పార్టీ ఖర్చుల కోసం, అనిల్ రాజ్భర్ అనే వ్యక్తి పుట్టినరోజు జరుపుకుంటున్న బిట్టును రూ.50 డిమాండ్ చేశాడు. ఈ చిన్న విషయానికే బిట్టు, అనిల్ మధ్య తీవ్ర వాగ్వాదం మొదలైంది.
క్షణికావేశం : గొడవ పెద్దదవుతుండటంతో, వారి స్నేహితుడైన భగత్ సింగ్ మధ్యలో జోక్యం చేసుకుని, ఇద్దరినీ శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. ఆ క్షణంలో, కోపంతో ఊగిపోయిన బిట్టు, తన వద్ద ఉన్న కత్తితో భగత్, అనిల్పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో, తీవ్ర గాయాలపాలైన భగత్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందగా, అనిల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
నిందితుల అరెస్ట్ : ఘటన అనంతరం, మృతుడి సోదరుడు నాగేంద్ర సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులైన బిట్టు, అతని స్నేహితుడు చందన్ను అరెస్ట్ చేశారు. చందన్పై ఇప్పటికే నాలుగు దోపిడీ, దాడి కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
డబ్బు కోసం తండ్రినే చంపిన తనయుడు : ఇలాంటిదే మరో విషాద ఘటన పంజాబ్లో చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలకు రూ.5000 ఇవ్వలేదని, ఓ కసాయి కొడుకు కన్నతండ్రినే కత్తెరతో పొడిచి చంపాడు. ఫతేగఢ్ సాహిబ్ జిల్లాకు చెందిన వీరేంద్ర సింగ్ (24), తండ్రి రూ.1000 మాత్రమే ఇస్తాననడంతో, కోపంతో ఆయన ఛాతీపై పలుమార్లు పొడిచి, పరారయ్యాడు.
ఈ రెండు ఘటనలు, క్షణికావేశం, చిన్న చిన్న కారణాలు ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో కళ్లకు కడుతున్నాయి.


