Three Drown After Cremation Rituals: అంత్యక్రియల అనంతరం నదిలో స్నానం చేయడానికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు గల్లంతై మరణించారు. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటీవల జైపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏడుగురిలో నలుగురి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఈ దుర్ఘటన జరగడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ALSO READ: Ayesha Meera Murder : ఆయేషా హత్య కేసు.. 18 ఏళ్ల తర్వాత తల్లి ఆవేదన.. సీబీఐపై తీవ్ర అసంతృప్తి
శనివారం రాత్రి జైపూర్ రింగ్ రోడ్డుపై కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే. మృతుల్లో నలుగురి అంత్యక్రియలు సోమవారం భిల్వారా జిల్లాలోని ఫులియా కలా గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన బంధువులు, స్నేహితులు అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఖరీ నదిలో స్నానానికి వెళ్లారు.
మొత్తం ఏడుగురు వ్యక్తులు నదిలో దిగగా, ముగ్గురు నీటిలో మునిగిపోయారు. మిగతా నలుగురిని వెంటనే రక్షించి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని షాహ్ పురా జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనలో మహేంద్ర మాలి (25), బర్ది చంద్ (34), మహేష్ శర్మ (35) మరణించినట్లు పోలీసులు తెలిపారు. విజయ్ ప్రతాప్ సింగ్ (30), ముఖేష్ గోస్వామి (25), రాకేష్ (28), జీవరాజ్ (30) గాయాలతో బయటపడ్డారు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న భిల్వారా ఎంపీ దామోదర్ అగర్వాల్, షాహ్ పురా ఎమ్మెల్యే లాలారామ్ బైర్వా, జిల్లా కలెక్టర్ జస్మిత్ సింగ్ సందూ ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ఏడుగురి మరణంతో విషాదంలో ఉన్న గ్రామంలో ఈ ఘటన మరోసారి విషాదాన్ని నింపింది.
ALSO READ: Couple Kills Children: ఇద్దరు పిల్లల్ని చంపి, దంపతుల సూసైడ్ ప్లాన్.. భార్య అరెస్ట్


