Businessman Killed Over Chair Cover Dispute at Wedding: మనిషిలో సహనం చచ్చిపోతోంది అనడానికి ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. పెళ్లి వేడుక అంటే ఆనందం, అలంకరణలు, సందడి. కానీ అక్కడ జరిగిన ఒక పెళ్లిలో కుర్చీలకు వేసిన కవర్ల రంగు (Colour of Chair Cover) నచ్చలేదన్న అత్యంత అల్పమైన కారణం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ వార్త ఇప్పుడు స్థానికంగానే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బల్లియా జిల్లాలో టెంట్ హౌస్ వ్యాపారిని హత్య చేసిన నిందితులు, మృతదేహాన్ని బైక్కు కట్టి మరీ నదిలో పడేశారు. ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
అసలేం జరిగింది?
పర్సియా గ్రామానికి చెందిన రాజ్కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన మేనల్లుడు అజిత్ కుమార్ సింగ్ అలియాస్ బోధా (45) టెంట్ హౌస్ నడుపుతుంటాడు. నవంబర్ 22న మజ్హౌవా గ్రామంలో జరిగిన ఒక వివాహానికి టెంట్, డెకరేషన్ పనులు చేయడానికి అజిత్ వెళ్లాడు. పనులన్నీ దగ్గరుండి చూసుకునేందుకు రాత్రి అక్కడే ఉండిపోయాడు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటికి బయలుదేరానని చెప్పిన అజిత్, ఎంతకీ ఇంటికి చేరలేదు. ఫోన్ చేసినా ఆచూకీ లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది హల్దీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గంగా నదిలో షాకింగ్ దృశ్యం
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నవంబర్ 25న హుకుం చప్రా ఘాట్ సమీపంలో గంగా నదిలో ఒక మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దగ్గరికి వెళ్లి పరిశీలించగా అది అజిత్ కుమార్ సింగ్ అని తేలింది. హంతకులు ఎంత క్రూరంగా ఆలోచించారంటే.. శవం నీటిపైకి తేలకూడదన్న ఉద్దేశంతో, అజిత్ మృతదేహాన్ని అతడి హీరో ప్యాషన్ బైక్కే గట్టిగా కట్టేసి నదిలో విసిరేశారు. పోలీసులు అతికష్టం మీద మృతదేహాన్ని వెలికితీశారు.
అసలు గొడవ రంగుదే!
పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నవంబర్ 22 రాత్రి 1 గంట సమయంలో పెళ్లి మండపంలో చిన్న గొడవ జరిగింది. నిందితులు పీయూష్ కుమార్ సింగ్, అనీష్ కుమార్ సింగ్, అంకుర్ సింగ్.. టెంట్ యజమాని అజిత్తో వాగ్వాదానికి దిగారు. “కుర్చీలకు, సోఫాలకు వేసిన కవర్ల రంగు మాకు నచ్చలేదు, వెంటనే మార్చేయాలి” అని వారు పట్టుబట్టారు. అర్ధరాత్రి వేళ అది సాధ్యం కాదని అజిత్ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ ముగ్గురు అతడిని కొట్టి చంపేశారు. అనంతరం ఆధారాలు దొరక్కుండా బైక్తో సహా నదిలో పడేశారు.
ముగ్గురి అరెస్ట్
మృతుడి సోదరుడు చందన్ కుమార్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బైరియా సర్కిల్ ఆఫీసర్ మహ్మద్ ఫహీమ్ ఖురేషి నేతృత్వంలోని బృందం గురువారం నాడు శాంతి నగర్ తిరాహా వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేసింది. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. కేవలం కుర్చీ కవర్ల రంగు కోసం మనిషిని చంపేంత కసాయిగా జనం ఎలా మారుతున్నారో అని ఈ ఘటన తెలిసిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Dalit Man Custodial Death: ఖాకీల కస్టడీలో దళిత యువకుడి అనుమానాస్పద మృతి! పోలీసులపై ఎస్సీ/ఎస్టీ కేసు

