Woman Drowns 3 Children, Then Jumps Into Water Tank: రాజస్థాన్లోని బలోత్రా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తన ముగ్గురు పిల్లలను ముందుగా నీళ్ల ట్యాంకులో ముంచి చంపి, ఆ తర్వాత తానూ అదే ట్యాంకులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
జసోల్ ప్రాంతంలోని తప్రా గ్రామం సమీపంలో ఒక పొలంలో ఉన్న వారి ఇంటి పక్కనే ఉన్న నీళ్ల ట్యాంకులోంచి ఆ మహిళ, ఆమె ముగ్గురు పిల్లల మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు.
ALSO READ: Samosa Argument Murder: సమోసా విషయంలో పిల్లల మధ్య గొడవ.. జోక్యం చేసుకున్న వృద్ధుడిని హతమార్చిన మహిళ
రాత్రి భోజనం తర్వాత..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, మమత (32) అనే మహిళ గత పది రోజులుగా పంట కోత పనుల కోసం తన కుటుంబంతో కలిసి పొలంలోనే నివసిస్తోంది. “బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత, కుటుంబ సభ్యులందరూ నిద్రకు ఉపక్రమించారు. ఆ తర్వాత మమత తన ముగ్గురు పిల్లలు – కుమారుడు నవీన్ (7), రుగారామ్ (4), మరియు ఆరు నెలల కూతురు మాన్విలను తీసుకుని నీటి ట్యాంకులో దూకినట్లుగా తెలుస్తోంది” అని సివానా డీఎస్పీ నీరజ్ శర్మ తెలిపారు.
గురువారం ఉదయం, మమత అత్తగారు ఇంట్లో ఆమె కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. నీళ్ల ట్యాంకు అంచున మమత చెప్పులు పడి ఉండటాన్ని గమనించిన ఆమె, లోపలికి చూసి మృతదేహాలు తేలుతూ ఉండటం చూసి శోకసంద్రంలో మునిగిపోయింది.
వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. జసోల్ పోలీసు స్టేషన్ బృందం, పౌర రక్షణ విభాగం సిబ్బంది గ్రామస్తుల సహాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీసి, పోస్ట్మార్టమ్ కోసం తరలించారు.
ప్రాథమిక అనుమానం ఆత్మహత్యే
ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మమత భర్త అండారామ్ పటేల్ గత ఐదు నెలలుగా బెంగళూరులో మెడికల్ షాపు నడుపుతున్నారని, అతనికి ఈ విషయం తెలియజేశామని పోలీసులు చెప్పారు.
మమత మామగారు బలోత్రాలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా, మమత తన పిల్లలు, అత్తగారితో కలిసి తప్రా గ్రామంలోని పొలంలో ఉంటున్నారు.


