Woman Killed her mother in law: అత్తాకోడళ్లు అన్నాక ఏ ఇంట్లో అయినా గొడవలు సహజం. సాధారణంగా కోడలిపై కోపంతో, వరకట్నం తేవాలంటూ కోడలిని అత్త హత్య చేసిన సందర్భాలు జరగడం చూస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్.. అత్తపై కోపంతో ఓ కోడలు మాస్టర్ ప్లాన్ వేసి దారుణంగా హతమార్చింది. దొంగా పోలీస్ ఆట ఆడుదామని చెప్పి నిలువునా దహనం చేసింది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Also Read: https://teluguprabha.net/national-news/vande-bharat-rss-song-controversy/
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా పెందుర్తికి చెందిన అప్పన్నపాలెంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వర్షిణి అపార్ట్మెంట్స్లో వృద్ధురాలు మహాలక్ష్మీ (63).. తన కొడుకు, కోడలు లలిత, మనుమరాలితో కలిసి నివసిస్తోంది. గత కొంత కాలంగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తనను చీటికిమాటికి తిడుతుందని లలిత తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో అత్తపై పగ పెంచుకుని.. ఆమెను చంపి అడ్డు తొలగించుకోవాలని మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగ పోలీసు ఆట ఆడుదామని అత్తను నమ్మించి ఆటలోకి దించింది.
ఆట పేరుతో అత్త మహాలక్ష్మీ కళ్లకు లలిత గంతలు కట్టింది. అనంతరం ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేసింది. పిల్లల కళ్లకు సైతం గంతలు కట్టేసింది. ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో వృద్ధురాలు అలాగే కూర్చుంది. అకస్మాత్తుగా పెట్రోలు తీసుకొచ్చి ఆమెపై పోసి నిప్పంటించింది. ఏం జరుగుతుందో గ్రహించే లోపే అత్తకు నిప్పంటుకుంది. అగ్ని కీలల్లో వృద్ధురాలు హాహాకారాలతో అక్కడికక్కడే మరణించింది. అయితే అత్త అరుపులు వినపడకుండా కోడలు టీవీ సౌండ్ ఎక్కువగా పెట్టింది.

అత్త మరణించిందని నిర్ధారించుకున్న లలిత.. వెంటనే అగ్ని ప్రమాదం జరిగిందంటూ కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు అందరూ అక్కడికి వచ్చారు. ఇంట్లో టీవీ వైర్లు కాలిపోయి షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో అత్త మరణించిందని సీన్ క్రియేట్ చేసింది. కుటుంబసభ్యులతో పాటు ఇరుగుపొరుగువారిని తప్పుదారి పట్టించడమే కాకుండా పోలీసులకు కూడా ఆమెనే సమాచారం అందించడం ఆమె మాస్టర్ ప్లాన్కి నిదర్శనం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.
ఈ ప్రమాదంలో లలిత కూతురికి కూడా గాయాలు కాగా.. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. అనుమానంతో లలిత ఫోన్ను చెక్ చేయగా.. అందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఒక వ్యక్తిని ఎలా చంపాలి? హత్య కేసు నుంచి ఎలా తప్పించుకోవాలి? వంటి వివరాలను లలిత వెతికినట్లు పోలీసులు గుర్తించి ఖంగు తిన్నారు. దీంతో అత్త పెట్టే వేధింపులు భరించలేక లలితనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.


