నమో నారసింహ నామస్మరణతో బీర్ పూర్ గుట్ట ప్రాంతం మారుమోగింది. భక్తుల జయజయధ్వానాల మధ్య బీర్ పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి రథంపై దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నిర్వహించిన రథోత్సవానికి భక్తులు పోటెత్తారు.

పూజల అనంతరం కొండపై నుంచి కిందికి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఉత్సవమూర్తులను తీసుకొచ్చారు. రథం ఎదుట అర్చకులు హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి రథం లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. మూడు గంటలకు ప్రారంభమైన రథోత్సవం మూడు గంటల పాటు అంగరంగ వైభవంగా సాగింది.

అనంతరం స్వామివారు మర్రిచెట్టు కింద సేద తీరి గుట్టపైకి వెళ్లారు. మాజీ ఎంపీపీ మసర్తి రమేశ్, కేడీసీసీబీ డైరెక్టర్ ముప్పాల రాంచందర్రావు, మాజీ సర్పంచ్ గర్షకుర్తి శిల్ప, గుడిసె జితేందర్, ఆలయ ఈవో శ్రీనివాస్, నాయకులు కొల్ముల రమణ, ఆలయ మాజీ చైర్మన్ సామ్రాట్, నేరెళ్ల సుమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

