ఒంటిమిట్ట(Ontimitta Kodandaramalayam) శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల బుక్లెట్ను టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు ఆవిష్కరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో సోమవారం బోర్డు సమావేశం అనంతరం ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ, ఏప్రిల్ 6 నుండి 14వ తేదీ వరకు శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఏప్రిల్ 5వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
ఇందులో భాగంగా ఏప్రిల్ 9న హనుమంత వాహనం, ఏప్రిల్ 10న గరుడవాహనం, ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఏప్రిల్ 12న రథోత్సవం, ఏప్రిల్ 14న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ జె.శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.