144 ఏళ్లకు ఓసారి జరిగే మహా కుంభమేళా(Kumbhmela) ముగింపు దశకు చేరుకుంది. 45 రోజులపాటు ఘనంగా కుంభమేళాను యూపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచే ఉత్తరప్రదేశ్, ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు
ఇప్పటివరకు దాదాపు 65 కోట్ల మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. నేడు పవిత్రమైన శివరాత్రి కావడం, కుంభమేళా సైతం ముగియనుండటంతో ఆఖరి పుణ్యస్నానాల కోసం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు.
చివరి పుణ్యస్నానం ఆచరించేందుకు సిద్ధం
అర్ధరాత్రి నుండి భక్తులు త్రివేణి సంగమంలో చివరి పుణ్యస్నానం ఆచరించేందుకు సిద్ధంగా ఉన్నారు. ‘బ్రహ్మ ముహూర్తం’ సమయం నుంచి ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల పుణ్య స్నానాలు మొదలయ్యాయి. మహా కుంభ చివరి రోజున భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్న డ్రోన్ విజువల్స్ ప్రభుత్వం షూట్ చేసింది.
హెలికాప్టర్ల నుంచి పూల వర్షం
మరోవైపు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరిస్తున్న భక్తులపై హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించారు. ఇటీవల పలుమార్లు ముఖ్యమైన రోజులలో భక్తులపై పూల వర్షం కురిపించారు అధికారులు. తాజాగా మహాశివరాత్రి, అందులోనూ కుంభమేళా ముగింపు కావడంతో భారీ సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న వారిపై పూలు చల్లారు.
మహా శివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో చివరి పవిత్ర స్నానం చేయడం చేయడానికి అర్ధరాత్రి నుండి భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుంటున్నారు.