హుజురాబాద్ మండలం సింగాపురం గ్రామంలోని శ్రీ పద్మా గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం స్వామివారి కల్యాణ వేడుకను కన్నుల పండువగా సాగింది.
గోవింద నామ స్మరణలో
ఈ కళ్యాణానికి భారీ సంఖ్యలో హాజరైన భక్తుల గోవింద నామస్మరణలు, వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణ మహోత్సవాన్ని ఆద్యంతం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వివాహ ఘట్టాలను, మాంగల్య ధారణ వంటి ఘట్టాలను వేద పండితులు వివరిస్తూ, ఆకట్టుకునే విధంగా కల్యాణాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్ర పఠనం, వ్యాఖ్యానం భక్తులను ఆకట్టుకుంది. కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని, ఉత్సవ విగ్రహాలకు, స్వామివారి, అమ్మవారి మూల విరాట్టు విగ్రహాలకు ప్రత్యేక అలంకరణలు చేశారు. దేవాలయాన్ని పూల మాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/8c22b43c-5492-4714-9492-d58ed902f0fc-1024x576.jpg)
హాజరైన నేతలు
శ్రీనివాసుని కల్యాణానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ స్వామి వారి కళ్యాణాన్ని ఆసాంతం తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని ప్రజలకు మంచి పంటలు పండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వొడితల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.